శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (13:06 IST)

కొండా విశ్వేశ్వర రెడ్డి ఆస్తులు రూ.895 కోట్లు.. పి.నారాయణ ఆస్తులు రూ.667 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో సంపన్న రాజకీయ నాయకుడిగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అవతరించారు. గత ఎన్నికల్లో తెరాస తరపున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన తెరాసలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్వేశ్వర్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.895 కోట్లుగా పేర్కొన్నారు.
 
అలాగే, తన పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.223 కోట్లుగా పేర్కొన్నారు. అదేసమయంలో తన భార్య, అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతా రెడ్డి చరాస్తుల విలువ 613 కోట్ల రూపాయలని వెల్లడించారు. ఇక తన కుమారుడి చరాస్తుల విలువ రూ.20 కోట్లని పేర్కొన్నారు. ఇక తన స్థిరాస్తుల విలువ రూ.36 కోట్లుగా పేర్కొన్న ఆయన.. భార్య స్థిరాస్తుల విలువ కేవలం రూ.1.81 కోట్లని అందులో పేర్కొన్నారు. గత 2014 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.528 కోట్లని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గత ఐదేళ్ళలో ఆయన ఆస్తులు విలువ రూ.985 కోట్లకు చేరింది. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ తన ఆస్తుల విలువ 667 కోట్ల రూపాయలని ప్రకటించారు. నెల్లూరు అసెంబ్లీ రూరల్ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన.. ఈ మేరకు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు.