శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By జె
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:34 IST)

భూమన కరుణాకర్ రెడ్డి రౌడీ, గూండా... తిరుపతిలో జనసేనాని

తిరుపతిలోని తారకరామ స్టేడియం జనసేన - బిఎస్పీ ఎన్నికల యుద్థభేరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరిణితి చెందిన రాజకీయనేతగా ప్రసంగం చేశారు. తిరుపతి వైసిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి రౌడీ, గూండా అని, టిడిపి అభ్యర్థి సుగుణమ్మ అల్లుడు సంజయ్ కబ్జాకోరు, లంచగొండని ఆరోపించారు. దళితులపై దాడులు చేసే వైసిపి నాయకులు మార్పు తెస్తారా అని ప్రశ్నించారు.
 
వై.ఎస్.జగన్ ఒకే సామాజికవర్గం వారు ఎదగాలని చూస్తున్నారు, మాయావతి రాజకీయాల్లో గొప్ప వ్యక్తని, ఉత్తరప్రదేశ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. ఎపి ప్రజలను బిజెపి గాలికొదిలేశారని, చంద్రబాబు ప్రజలను దగా చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డిగారు కెసిఆర్‌తో కలిసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మోడీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు.
 
ఇదే తారకరామ స్టేడియంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తామని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జనసేన పార్టీ  అధికారంలోకి వస్తే క్లీన్ సిటీగా తిరుపతిని మారుస్తామన్నారు.
 
తిరుమల నిర్వాసితుల సమస్యలు తీరుస్తామని, అర్హులైన నిరుపేదలందరికీ  ఇళ్ళు నిర్మించి ఇస్తామన్నారు. తలకోనను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. 
జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తామన్నారు. 
 
చిత్తూరు జిల్లాలో జనసేన-బిఎస్పీల గుర్తులపై పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు తెలియకుండా ఇబ్బందిపడ్డ పవన్ కళ్యాణ్... పక్కనే ఉన్న నేతలను పిలిచి లిస్ట్ తీసుకురమ్మని కంటి అద్దాలు పెట్టుకుని ఒక్కొక్క పేరు చదివి వినిపించారు.