శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (13:58 IST)

పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన మహిళలు.. అభివృద్ధికి ఓటేస్తామంటున్న యువత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి చెదురుముదురు సంఘటనలు జరిగినప్పటికీ ఆ తర్వాత అంతా సర్దుకున్నాయి. దీంతో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నానికి ఓటింగ్ శాతం కూడా క్రమంగా పెరుగుతోంది. 
 
అదేసమయంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఫలితంగా ఏ ఒక్క పోలింగ్ కేంద్రంలో చూసిని మహిళా ఓటర్లే కనిపిస్తున్నారు. ఎండని సైతం లెక్క చేయకుండా వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు తరలి వెళుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే యువతరం కూడా పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీసింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారు ఎంతో ఉత్సాహం చూపిస్తూ గంటల కొద్దీ క్యూలైన్లలో నిలుచునివున్నారు.  ముఖ్యంగా పట్టణాల్లో పల్లెల్లో మహిళా ఓటర్లు దండెత్తారు. అలాగే, యువత కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు వేస్తామంటున్నారు. 
 
ఇదిలావుంటే, పోలింగ్ సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడం మన సామాజిక బాధ్యత. రాష్ట్రం ప్రస్తుతం కీలక పరిస్థితుల్లో ఉంది. ఓటు వేయకుండా ఎవరూ అడ్డుకోలేరు. ఈవీఎంలు పనిచేయడంలేదని వెనుదిరగడం దురదృష్టకరం. వెళ్లినవాళ్లు మళ్లీ తిరిగివచ్చి ఓట్లు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
వీవీ ప్యాట్ రశీదుల్లో ఎవరికి ఓటు పడిందో కూడా చెక్ చేయాలని సూచించారు. వేరే పార్టీకి ఓటుపడితే వెంటనే ఫిర్యాదు చేయాలన్న చంద్రబాబు.. ఈవీఎంలు పనిచేయక పోవడం, ప్రారంభమైన కొద్దిసేపట్లోనే మొరాయించడం, పార్టీల గుర్తులు మారడం, ఒకపార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పడటం, దుష్పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.