1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (08:36 IST)

ఎన్నికల విచిత్రం.. నేనుండగా నా భర్తకు ఎలా టిక్కెట్ ఇస్తారు.. భర్తపై రెబల్ అభ్యర్థిగా భార్య పోటీ... ఎక్కడ?

duvvada vani
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాలో పలు నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద ఎక్కువైంది. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆయన భార్య వాణి పక్కలో బల్లెంలా తయారయ్యారు. తన భర్తపై తాను పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు. మరోవైపు, ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ 19వ తేదీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. 
 
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఇపుడు అధికార వైకాపా రాజకీయ విచిత్రంగా మారింది. దీనికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి చేసిన సంచలన ప్రకటనే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె ప్రకటించడంతో వైకాపా నేతలు, శ్రేణులు ఖంగుతిన్నాయి. ప్రస్తుతం ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. గురువారం ఆమె జన్మదినం కావడంతో కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆమె వారితో మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన టెక్కలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించడంతో వారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. 
 
నిజానికి దువ్వాడ శ్రీనివాస్ దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని ఆమె సీఎం జగన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వాణి టెక్కలి నియోజకవర్గం నుంచి ఇన్‌చార్జిగా వైకాపా నియమించింది. అయితే, ఆమె భర్త శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆగ్రహించిన ఆమె... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.