గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (15:04 IST)

40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబుగారూ... ఇదేనా మీ తీరు: మంత్రి సుచరిత జస్ట్ ఆస్కింగ్

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆమె మాటల్లోనే... గౌరవ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో అనేక సందర్భాల్లో సూచించడం జరిగింది. గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పూర్తిగా మరచిపోయిన గౌరవ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గారు కేవలం జూం మీటింగ్‌ల ద్వారా ప్రభుత్వం పైన, అధికార యంత్రాంగం పైన తరచుగా నిరాధారమైన, చిల్లర ఆరోపణలు చేయడం భావ్యం కాదు.
 
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మీరు చేసిన, మీ పార్టీ నాయకులు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, హత్యలు వీటన్నిటికీ తగిన శాస్తిగా ప్రజలు గత ఎన్నికల్లో తమరిని కేవలం 23 స్థానాలకే పరిమితం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రాకపోవడం అత్యంత దురదృష్టకరం. ఇదే రకంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఆ ఇరవై మూడు కూడా రావని స్పష్టంగా కనిపిస్తుంది.
 
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తుంటే అది జీర్ణించుకోలేని చంద్రబాబు జూంలో ఆరోపణలు చేస్తున్నాడు. దళితుల పట్ల, మైనారిటీల పట్ల, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రవేశపెడుతున్న పథకాలు దేశ చరిత్రలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి అన్న విషయాన్ని గుర్తించలేని అవివేకులు మీరు.
 
సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు వచ్చిన సదరు ఇన్స్పెక్టరు, హెడ్ కానిస్టేబుల్ పైనా నాన్-బైయిల బుల్ 306 (10years) శిక్ష సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అంతే కాకుండా బెయిల్ ను రద్దు కోరుతూ అప్పిలుకు వెళ్లిన విషయం తెలియదా మీకు..? సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో  బెయిల్ ఇప్పించిన అడ్వకేట్ వేదుర్ల రామచంద్రారావు గారు టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని అని స్వయంగా అంగీకరించారు కదా అది నిజం కాదా..?
 
గౌరవ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే పోలీస్ శాఖను నిందించడం వెనుక ఉన్న మీ ఉద్దేశం ఏమిటో...? ప్రతిసారి అనవసర విషయాలలో అసంధర్భంగా స్పందిస్తూ... పోలీస్ శాఖ పైన దుమ్మెత్తి పోస్తూ... మీరు ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు...? ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిపైన పూర్తి వివరాలు తెలుసుకుని స్పందిస్తే బాగుంటుందని కోరడం జరిగింది.
 
నిస్వార్ధంగా, పారదర్శకంగా రాష్ట్ర ప్రజలకు చరిత్రలో ఎన్నడు లేని విధంగా మెరుగైన, ఉత్తమమైన పోలీసింగ్‌ను అందిస్తున్న పోలీసుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బకొట్టాలని మీరు ఎందుకు భావిస్తున్నారు. దీని వెనుక మీరు పన్నిన పన్నాగం ఏమిటి..? కోట్లాది రూపాయల ఈఎస్ఐ అవినీతి కేసులలో లక్షల మంది కార్మికుల మరియు కార్మికుల కుటుంబాల ఇన్సూరెన్స్ సొమ్ము కాజేసిన అచ్చెన్నాయుడు నెలల తరబడి స్టార్ హాస్పిటల్స్ లో సేదతీరిన విషయం వాస్తవం కాదా..? 
 
కార్మికులకు చెందిన వందల కోట్లను దోచుకొని వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసిన అచ్చం నాయుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించింది మీరు కాదా.. దీని ద్వారా మీరు మీ పార్టీ నాయకులకు ఇస్తున్న సందేశం ఏమిటి..? ఇదే మీ స్వభావమని ప్రజలందరికీ తెలుసు. కొల్లు రవీంద్ర అరెస్టయింది అతి దారుణమైన హత్య కేసులో... ఉన్న వాస్తవాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారా..?
 
జైలు, బెయిలు, శిక్షల గురించి గౌరవ  చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ప్రజలను అన్ని విధాల మోసం చేసిన గొప్ప గొప్ప నేరస్తులను వెనకేసుకొస్తున్న ఘనత మీకు మాత్రమే దక్కుతుంది. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పొందనన్ని అత్యధిక స్థాయిలో స్టేలు పొంది రికార్డు సాధించిన ఘనత మీది కాదా చంద్రబాబునాయుడు గారు.
 
కేసు విచారణ ముందుకు సాగనీయకుండా మీరు ఎన్ని కుట్రలు పన్నుతున్నారో  దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియనిది కాదు. డిజిపి గారు నిష్పక్షపాతంగా గతంలో పని చేశారని మీరే స్వయంగా చెబుతున్నారు. డి‌జి‌పి గారి నిజాయితీ, సమర్ధత, పనితనం గురించి దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా అందరికీ తెలిసిందే. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు.
 
మీరు మీ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం సీబీఐ ను సైతం వదలరా..? సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అనుమతి నిరాకరిస్తూ జీవో విడుదల చేసిన ఘనత మీ ప్రభుత్వానిది కాదా..?అవాస్తవాలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్న మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఏప్పటికీ అంగీకరించరు ఇది గుర్తించుకోవాలి.
 
ఇలాంటి గోబెల్ ప్రచారం కారణంగానే గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమకు సరైన రీతిలో సమాధానం ఇచ్చారు. ఒక అబద్దాన్ని పదే పదే ఆరోపిస్తూ దాన్ని నిజం చేసే ప్రయత్నం మానుకోవాలని గౌరవ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తున్నాను. ఈ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఎక్కడైనా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తే తక్షణమే వారి పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి, జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయి.
 
మీ ప్రభుత్వంలో వనజాక్షి, రిషితేశ్వరి, విజయవాడ కాల్ నాగుల ఘటన, మీ పబ్లిసిటీ పిచ్చి కారణంగా గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు మీరు సీబీఐ విచారణ కోరలేదు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు సి‌బి‌ఐ దర్యాప్తు..? కరుడుగట్టిన నేరస్థుడు కంటే దారుణంగా వ్యవహరించే మీ పార్టీ నేత  చింతమనేని ప్రభాకర్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి..? ఎన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడో మీకు తెలియదా..! ఏ రోజైనా ఆయనపై చర్యలకు పూనుకున్నారా..? 
 
మహిళా ఎమ్మార్వో వనజాక్షి ని సీఎం ఆఫీసుకు పిలిపించి బెదిరించి, ప్రాణభయంతో ఆమెతో రాజీ చేయించడం మీ ఆధ్వర్యంలో జరగలేదా..? పదేపదే ఎవరూ అడగకపోయినా నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు గారు మీరు వ్యవహరించే తీరు ఇదేనా.. మీరు వ్యవహరించే ఈ తీరు పట్ల రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఒక మతిభ్రమించిన నాయకుడు గా మాత్రమే భావిస్తున్నారు. మీరు చేస్తున్న ఈ ఆరోపణలపై స్పందించేందుకు కనీసం మీ కార్యాలయంలోని కార్యకర్తలు కూడా ముందుకు రావడం లేదని మీరు గ్రహించాలి. ఇప్పటికైనా హుందాగా వ్యవహరించి మీ శేష జీవితం ప్రశాంతంగా గడపాలని గడుపుతారని కోరుకుంటున్నాను అని అన్నారు.