శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (10:59 IST)

50 మంది చనిపోయినా జగన్‌లో చలనం లేదు..టీడీపీ

కచ్చులూరు బోటు ప్రమాదం జరిగి 23రోజులైనా చనిపోయినవారి మృతదేహాలు దొరక్కపోయినా, తమవాళ్ల శవాలు ఎప్పుడు తమకందుతాయో తెలియని అయోమయావస్థలో మృతుల కుటుంబాలున్నా, అధికార యంత్రాంగం పడవను బయటకు తీయడంలో ఘోరంగా విఫలమైనా ముఖ్యమంత్రి జగన్‌ స్పందించకపోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీమంత్రి కళావెంకట్రావు ఆవేదన వ్యక్తంచేశారు.

ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గోదావరిలో ఘోరదుర్ఘటన జరిగి 50మందికిపైగా చనిపోయినా, కించిత్‌కూడా పశ్చాత్తా పం, స్పందన వ్యక్తంచేయని ముఖ్యమంత్రి జగన్‌ వైఖరి, నీరోచక్రవర్తిని మించిపోయిందని ఆయన మండిపడ్డారు.

మునిగిపోయిన పడవ 300 అడుగుల లోతులో ఉంటే, ముఖ్య మంత్రి జగన్‌ 3వేల అడుగుల ఎత్తులో తూతూమంత్రంగా ఏరియల్‌సర్వేతో సరిపెట్టాడన్నా రు. ఆ సర్వే తర్వాత ఒక్కరోజైనా ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎందుకు సమీక్షలు చేయలేదని కళా ప్రశ్నించారు.

ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలను ఎలా ఆదుకున్నారు... ఎంత నష్టపరిహారం అందించారు.... మృతదేహాల వెలికితీతకు ఎటువంటి చర్యలు చేపట్టారు..  బోటు బయటకుతీయడానికి సంబంధిత అధికారులు ఇన్నిరోజులు ఎందుకు కాలయాపన చేశారు..

గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేశారనే విషయాలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదని మాజీమంత్రి నిలదీశారు. నీళ్లలోని బోటుని బయటకుతీయడం ప్రభుత్వానికి పెద్దసమస్యగా మారిందనే విషయాన్ని జగన్‌ తెలుసుకోవాలన్నారు.  

గతనెల 18న ప్రమాదం జరిగి, అమాయకులైన ప్రజలుచనిపోతే దానిగురించి జగన్‌గానీ, దుర్ఘటనపై ఆయనవేసిన మంత్రివర్గ కమిటీగానీ ఏమీతేల్చకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా అని వెంకట్రావు ప్రశ్నించారు. జరిగిన దుర్ఘటనపై వెంటనే న్యాయవిచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌చేశారు. 

ప్రజలకు తనకు ఏవిధమైన సంబంధం లేదన్నట్లుగా, వారికి ఏం జరిగినా, వారేమైనా తానేమీ స్పందించనన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రవర్తన ఉందన్నారు. జరిగిన ప్రమాదంపై  ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసమీక్ష కూడా చేయనివ్యక్తి, తమవారిని కోల్పోయి పుట్టెడు దుఖంలోఉన్న మృతులకుటుంబాలకు న్యాయంచేస్తాడనుకోవడం అత్యాశే అవుతుం దన్నారు.

వరదప్రవాహం 4లక్షలక్యూసెక్కుల లోపుంటేనే ప్రయాణాలకు అనుమతివ్వాలన్న నిబంధనను కాదని, 5.11లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి ఉన్నప్పుడు, ఎవరి ఆదేశాలతో పర్యాటకుల బోటు కదిలిందో ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.
 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్యహత్యలన్నాడు.. మరి ఇప్పుడేమంటాడు..?
ప్రతిపక్షంలో ఉండగా మే16 2018న  'పడవప్రమాదంలో జరిగిన మరణాలన్నీ సర్కారు హత్యలనీ,  ప్రభుత్వ నిర్లక్ష్యం, మంత్రులు సహా అధికారులు తీసుకున్న లంచాలు, అవినీతి పర్యవేక్షణ లోపం వల్లే అమాయకులు చనిపోయారని, కాబట్టి ఆయా సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, హత్యానేరం కింద ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని, చనిపోయిన వారికి ఒక్కొక్కరికీ రూ.20 లక్షల పరిహారం అందించాలని' గగ్గోలుపెట్టిన జగన్‌, ఇప్పుడేమంటారని కళానిలదీశారు.

ప్రతిపక్షంలో ఉండగా ప్రమాదంపై చిలువలు పలువలుగా మాట్లాడిన వ్యక్తి అధికారంలోకి వచ్చాక కనీస స్పందన కూడా ఎందుకు తెలియచేయడం లేదన్నారు. జగన్‌ గతంలో చెప్పినట్లుగానే కచ్చులూరు పడవ ప్రమాదం కూడా ప్రభుత్వ అవినీతి, మంత్రుల లంచాల వల్లే జరిగిందా.. ఈ దుర్ఘటనపై కూడా వైసీపీ ప్రభుత్వంపై హత్యానేరం మోపాలా అని మాజీమంత్రి ప్రశ్నించారు.