శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 29 జనవరి 2019 (20:42 IST)

మరో యువకుడితో ప్రేయసి... తట్టుకోలేక ఉరి వేసుకున్న ప్రియుడు

ప్రాణం కంటే మిన్నగా ఓ యువతిని ప్రేమించాడు ఆ యువకుడు. కొన్నాళ్ల తర్వాత ముఖం చాటేసింది ఆ ప్రియురాలు. మనస్థాపం చెందాడు ఆ యువకుడు. ప్రియురాలు లేని జీవితం వద్దనుకున్నాడు. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆ ప్రేమికుడు.
 
వివరాలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌కు చెందిన సోనోరావు హైదరాబాద్ బోయిన్ పల్లి సిక్ విలేజ్‌లో తన మిత్రుడితో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ పరిశ్రమలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు సోనోరావు. కొన్నాళ్ల తర్వాత సోనోరావుని అలక్ష్యం చేసింది ఆ యువతి. దాంతో తీవ్ర ఆవేదనకు గురయ్యేవాడు. 
 
ప్రేమించిన యువతి కాదనడంతో పాటు.. మరో వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతుందన్న విషయం తెల్సుకుని ఖంగుతిన్నాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ యువతి దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు. దాంతో జీవితంపై విరక్తి చెందాడు. ప్రియురాలు లేని జీవితం వద్దనుకుని గదిలోని ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు సోనోరావు. 
 
ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. గది తాళాలు పగులగొట్టి.. లోపలికి వెళ్లి చూడగా.. ఫ్యానుకి సోనోరావు మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు పాల్పడ్డ సోనోరావు మృతదేహాన్ని కిందకు దింపారు పోలీసులు. క్లూస్ టీమ్ పోలీసులు చేరుకుని ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. 
 
ప్రేమ విఫలమై సోనోరావు బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెల్సుకున్న అతని కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చెట్టంత ఎదిగిన కుమారుడు చివరికి ఇలా ప్రాణాలు తీసుకోవడంతో.. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.