గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (17:03 IST)

బీజేపీవి జిమ్మిక్కులు.. పవన్ వాదనతో రాములమ్మ ఏకీభావం

ఇంట గెలిచి రచ్చ గెలవడం పాత విధానం... కానీ ఇప్పుడు రచ్చ గెలిచి ఇంట్లో మాత్రం తిట్టించుకుంటున్నారు కేంద్ర అధికార భాజపా నేతలు. ఒకవైపు ఎయిర్‌ స్ట్రయిక్‌లతో పాక్‌ని గడగడలాడించి, అంతర్జాతీయంగా దాయాది దేశాన్ని ఒంటరిని చేసి పొరపాటున అక్కడ దొరికిన అభినందన్‌ని తెప్పించుకోవడంలో కూడా చొరవ చూపి సాధించుకున్న కేంద్ర అధికార పక్షం... ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది.
 
వివరాలలోకి వెళ్తే... ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భాజపా జిమ్మిక్కులు చేస్తుందని తాను ఎప్పుడో చెప్పిన విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. పవన్ వాదనను తాను కూడా పూర్తిగా సమర్థిస్తున్నట్టు చెప్పిన విజయశాంతి.. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలు మానుకోవాలని భాజపాకి హితవు పలికారు. 
 
ఈ మేరకు ఫేస్‌బుక్‌లో  పోస్టు చేసిన ఆవిడ సరిహద్దులో మన సైనికులు శతృదేశంతో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే యడ్యూరప్ప వంటి బీజేపీ నేతలు దానిని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తూండడం హేయమనీ, ఇటువంటి వారిని చూసి దేశ ప్రజలు ఛీ కొడుతున్నారనీ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన భారతీయ జనతా పార్టీ జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటితో ప్రజలను ఇబ్బందులలో పడేసిందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ దేశ భద్రతను పణంగా పెడుతోందని మండిపడ్డారు. 
 
రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రతే ముఖ్యమనుకోవడం వల్లే కేంద్రానికి మద్దతు ఇచ్చినట్లు విజయశాంతి పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు ఉన్న నిబద్ధత కూడా కేంద్రానికి లేకపోవడం దారుణమన్నారు. కాగా... యడ్యూరప్ప వ్యాఖ్యలకు స్పందించని మోడీ.. బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో మునిగి తేలడాన్ని బట్టి  వారి అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చనని కూడా విజయశాంతి పేర్కొన్నారు.