ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (18:48 IST)

జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ అరెస్టు.. అట్రాసిటీ కేసు నమోదు..

అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలు మళ్లీ అరెస్టు అయ్యారు. నెల రోజులుకు పైగా జైలులో ఉండి వచ్చి కోర్టు మంజూరు చేసిన షరతుల బెయిలుపై వారిద్దరూ శుక్రవారం విడుదలయ్యారు. వీరిద్దరూ విడుదలై 24 గంటలు కూడా గడవకముందే పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. పైగా, జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసారు. 
 
కడప జైలు నుంచి విడుదలై తాడిపత్రి వచ్చే క్రమంలో భారీ కాన్వాయ్‌తో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో సీఐ దేవేంద్రకుమార్ ఆయన కాన్వాయ్‌ను నిలువరించారు. ర్యాలీలకు ప్రస్తుత నిబంధనలు ఒప్పుకోవని సీఐ స్పష్టం చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించినట్టు సమాచారం. 
 
పైగా, స్థానిక సీఐతో ఆయన వ్యవహారశైలి వీడియోల్లోనూ స్పష్టమైంది. దాంతో సీఐ దేవేంద్ర కుమార్ తాడిపత్రిలో ఫిర్యాదు చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాకుండా, వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని తాడిపత్రి డీఎస్పీ వెల్లడించారు. 
 
ఈ రెండు కేసుల్లో తాడిపత్రి ఒకటో పట్టణ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. అనంతరం వారిని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆపై వారిద్దరినీ గుత్తి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచి జైలుకు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు.