శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (18:33 IST)

"మూడు"పై ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్.. గెజిట్‌పై స్టేటస్ కో

ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానులపై విడుదల చేసిన గెజిట్‌ను నిలిపి వేయాలని దాఖలైన పిటిషన్‌ హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించి, విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మూడు రాజధాని గెజిట్‌పై స్టేటస్ కో(యథాతథ స్థితి) ఆదేశాలను హైకోర్టు జారీచేసింది. 
 
రాజధాని తరలింపుతో పాటు, సీఆర్డీఏ రద్దు చట్టంపై స్టేటస్ కో విధించింది. 10 రోజుల పాటు యథాతథ స్థితి అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 14వ తేదీ వరకు ఇది కొనసాగుతుందని పిటిషన్‍ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల సమయం కావాలని కోర్టును ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు.
 
పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సర్కారు దూకుడుకు కాస్తంత బ్రేక్ పడినట్టయింది.