శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (10:35 IST)

జగన్ అక్రమాలు వెలికి తీసిన ఐఆర్ఎస్‌పై సస్పెండ్ వేటు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా విధులు నిర్వహించిన ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌పై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు అనూహ్య రీతిలో సస్పెండ్‌ వేటు వేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 'నాడు జగన్‌ అక్రమాలను వెలికి తీసినందుకే నేడు ఈ శిక్ష కాబోలు' అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌. కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. చంద్రబాబు హయాంలో ఈడీబీ సీఈవోగా పని చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనను పక్కకు తప్పించింది. ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. అయితే... తనను రిలీవ్‌ చేస్తే కేంద్ర సర్వీసులకు వెళతానని కృష్ణ కిశోర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ఆయనను సర్కారు రిలీవ్‌ చేయలేదు. 
 
గురువారం అనూహ్యంగా ఆయనను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖల నుంచి అందుకున్న నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవోలో తెలిపారు. 
 
కృష్ణ కిశోర్‌పై ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌, సీఐడీ విడివిడిగా కేసులు నమోదు చేసి, అక్రమాలపై విచారణ జరిపి ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనల ప్రకారం జాస్తి కృష్ణ కిశోర్‌ను సస్పెండ్‌ చేస్తున్నామని, క్రమ శిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు... విచారణ పూర్తయ్యేవరకు హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లకూడదని కృష్ణ కిశోర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.