శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:01 IST)

పల్నాటి పులి ఇకలేరు : కోడెల శివప్రసాద్ ఆత్మహత్య

గుంటూరు జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు పులిగా గుర్తింపు పొందిన మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఇకలేరు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 72 యేళ్లు. 1947 మే 2న తేదీన జన్మించిన కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. 
 
ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించగా, అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆ చికిత్స ఫలించక కన్నుమూశారు. 
 
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కోడెలకు రాజకీయ వేధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా, ప్రభుత్వమే ఆయనపై కక్షగట్టి ఈ వేధింపులకు పాల్పడుతోందంటూ ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దీంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
కాగా, 1947 మే 2న తేదీన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట అనే గ్రామంలో జన్మించారు. ఆయన 1983, 85, 89, 94, 2014 సంపత్సరాల్లో అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 2014లో సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది ఏపీ స్పీకర్‌గా పని చేశారు. 
 
1987-88 మధ్యకాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1996-97 మధ్యకాలంలో భారీ నీటి పారుదల శాఖామంత్రిగానూ, 1997-99లో పంచాయతీ రాజ్ శాఖామంత్రిగా పని చేశారు.