శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (19:50 IST)

బడ్జెట్ సమావేశాలకు వైసీపి సభ్యులను ఆహ్వానిస్తున్నా... స్పీకర్ కోడెల, వస్తారా?

అమరావతి : మార్చి 5వ తేదీ నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాలకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి ఫరూక్, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశించారు. సచివాలయంలోని అసెంబ్లీ హాల్‌లో పోలీసు ఉన్నతాధిక

అమరావతి : మార్చి 5వ తేదీ నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాలకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి ఫరూక్, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశించారు. సచివాలయంలోని అసెంబ్లీ హాల్‌లో పోలీసు ఉన్నతాధికారులతో బడ్జెట్ సమావేశాల భద్రతపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు‌తో కలిసి సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. గతంలో మాదిరిగానే బడ్జెట్ సమావేశాలకు గట్టి భద్రత కల్పించాలని ఆయన తెలిపారు.

లాబీల్లోకి ఇతరులు వస్తున్నారని, అటువంటి వారిని అడ్డుకోవాలని భద్రతా సిబ్బందికి శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి ఫరూక్ ఆదేశించారు. అసెంబ్లీకి వచ్చే ప్రధాన ద్వారం వద్ద పనిచేసే పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. బడ్జెట్ సమావేశాలకు మార్చి 5న అసెంబ్లీకి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ వస్తున్న నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశించారు. 
 
మార్చి 23న జరిగే రాజ్యసభ ఎన్నికలకు పటిష్ట ఏర్పాటు చేయాలన్నారు. భద్రతకు అవసరమైన సిబ్బందిని సమీకరించుకోవాలన్నారు. సందర్శకులకు ముందురోజే పాస్ లు జారీ చేయాలని, సభ లోపలికి వచ్చే సమయంలో వారి దగ్గర ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. సందర్శకులు వేచి ఉండేలా 3వ నెంబర్ గేట్ వద్ద టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. వేసవి కావడంతో తాగునీటి కొరత రానీయొద్దని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగపర్చాలని ఆయన ఆదేశించారు.

ముఖ్యంగా భద్రత విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని, అవసరమైన చోట కొత్తగా ఏర్పాటు చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. సభ ఎదుట చలో అసెంబ్లీ, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు జరగకుండా చూడాలన్నారు. సభ్యులపై అవగాహన కలిగి, వారిని గుర్తించి బాధ్యతాయుతంగా పని చేసేవారిని అసెంబ్లీ ప్రధాన ద్వారం నియమించాలన్నారు. ఎవ్వరి పట్ల అనుచితంగా ప్రవర్తించొద్దన్నారు. మీడియా సిబ్బందికి ఇప్పటికే పాస్ లు అందజేశామన్నారు. అక్రిడేషన్ కార్డు లేకుండా అసెంబ్లీ ఆవరణలోకి ఎవ్వరినీ అనుమతించొద్దన్నారు.
 
లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సీఎ చంద్రబాబునాయుడు నివాసం సమీపంలో ఉన్న కరకట్ట మీదుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ అధికారుల వాహనాల రాకపోకలు సాగించేలా భద్రత చేపట్టామన్నారు. సాధారణ ప్రజలు, ఇతరులకు ఉండవల్లి, పెనుమాక మీదుగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గవర్నర్ రానున్న నేపథ్యంలో భద్రత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రిహార్షల్స్ సైతం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో సచివాలయ అధికారులతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
వైఎస్ఆర్ సిపి సభ్యులను ఆహ్వానిస్తున్నా...
విలేకరులతో మాట్లాడుతూ, మార్చి 5వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. 8వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. గత అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్ సిపి సభ్యులు బహిష్కరించారని ఆయన గుర్తు చేశారు. అయితే, బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని, అందరి సభ్యుల మాదిరిగానే వారినీ ఆహ్వానిస్తున్నామన్నారు. సభ్యులకు సభలో మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. సభకు హాజరై, ప్రజా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోరారు.