బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (09:22 IST)

సైకిల్ దూకుడు తగ్గించండి... చంద్రబాబుకు గవర్నర్ సూచన

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఓ సూచన చేశారు. కేంద్రంపై దూకుడు ఎంతమాత్రం తగదంటూ హితవు పలికారు. కేంద్రంతో సామరస్యంతో ముందుకు సాగాలాని

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఓ సూచన చేశారు. కేంద్రంపై దూకుడు ఎంతమాత్రం తగదంటూ హితవు పలికారు. కేంద్రంతో సామరస్యంతో ముందుకు సాగాలాని ఆయన కోరినట్టు సమాచారం.
 
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్న విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో ఈ రాజకీయ వేడిని చల్లార్చాలని కాస్త స్పీడు తగ్గించాలని స్వయానా రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. కేంద్రంతో సామరస్యమే మేలని.. ఢిల్లీతో సంబంధాలు బాగుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన అన్నట్లు సమాచారం. 
 
విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన గవర్నర్‌.. శనివారం రాత్రి హైదరాబాద్‌ తిరుగుప్రయాణం అవ్వాల్సి ఉండగా.. మనసు మార్చుకుని రాత్రికిరాత్రే రైలులో విజయవాడ చేరుకున్నారు. గేట్‌వే హోటల్లో బసచేశారు. కేంద్రం తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు, తిరుపతిలో తలపెట్టిన భారీ బహిరంగ సభ, హోదాపై బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తుచేస్తామని సీఎం ఇదివరకే ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఆదివారం ఏకాంతంగా సమావేశమైన వీరిద్దరూ గంటా 40 నిమిషాల పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కేంద్రం-రాష్ట్రం మధ్య నెలకొన్న పరిస్థితులు, కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.