శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2019 (20:01 IST)

ఏపీలో ఎన్నికల వేళ రూ. 17.50 కోట్ల విలువైన మద్యం సీజ్

గత సంవత్సరం ఇదే కాలంలో సరఫరా చేసిన మేరకే ప్రస్తుతం మద్యం విడుదల చేస్తున్నామని రాష్ట్ర అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎన్నికల నేపథ్యంలో సరఫరాను నియంత్రించేందుకు తమ విభాగం పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం గత మార్చి నెలతో పోల్చితే  ప్రస్తుతం సరఫరా పరంగా 2.5 శాతం తక్కువగానే ఉందన్నారు. 
 
ఆకస్మిక తనిఖీలలో భాగంగా శుక్రవారం మీనా శ్రీకాకుళం, విజయ నగరం జిల్లాలలో పర్యటించారు. శ్రీకాకుళం శివారు ఎచ్చర్లలోని ఆబ్కారీ డిపోను తనిఖీ చేశారు. డిపో ఆవరణలో అపరిశుభ్రతపై మండిపడ్డారు. జిల్లా పరిధిలో చేసిన మద్యం సీజ్ వివరాలపై అరా తీశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని ఎసి సుకేష్, ఈఎస్ ఆదినారాయణ, డిపో మేనేజర్ కుమార స్వామి తదితరులను హెచ్చరించారు.
 
అనంతరం రణస్థలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని యునైటెడ్ బ్రూవరీస్‌ను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది సంస్థ పనితీరు వివరించారు. సంస్థ రికార్డ్ తనిఖీ చేశారు. సామాజిక బాధ్యతగా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను మీనా పరిశీలించారు. తదుపరి విజయనగరం జిల్లాలోని  భోగాపురం ఎక్సైజ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఇక్కడ రికార్డులను పరిశీలించిన మీనా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ద్వారా అందిన సమాచారం మేరకు ఎలా పనిచేస్తున్నారన్న విషయంపై ఆరా తీశారు. 
 
ఈ నేపధ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు 450 ఫిర్యాదులు రాగా 280 కేసులు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఫిర్యాదును 48 గంటల వ్యవధిలో పరిష్కరించేలా ప్రణాళిక రూపకల్పన జరిగిందని అన్నారు. ఎన్నికల వేళ మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 4500 కేసులలో దాదాపు 17.50 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు. మద్యం డిపోలు, షాప్‌లు, బ్రూవరీస్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల విజయవాడ నుండి పర్యవేక్షణ సాధ్యమవుతుందన్నారు.
 
రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు 5 లక్షల లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామని, ఎన్నికల నేపథ్యంలో 31 తనిఖీ కేంద్రాలను 68కి పెంచామన్నారు. ప్రస్తుతం గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సందర్శన పూర్తి అయ్యిందని సోమవారం అనంతపురం జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. వ్యక్తులు 6 సీసాలు మించి మద్యం తమ వద్ద ఉంచుకోరాదని మీనా తెలిపారు. రహదారుల వెంబడి మద్యం షాపుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు తమ శాఖ పని చేస్తుందన్నారు.