శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (06:28 IST)

ఏపీలో మూడు రాజధానులా?.. మూడు జోన్లా?

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మూడు రాజధానులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అందులో సఫలీకృతమవుతుందా?.. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో వెనుకడుగు వేస్తుందా?.. ఇంతకీ వైసీపీ ప్రభుత్వ ప్రయత్నం మూడు రాజధానుల కోసమా? లేక మూడు జోన్ల ఏర్పాటు ప్రయత్నమా?...
 
ఏపీ కేబినెట్‌ ఈనెల 20న భేటీ కానున్నది. అదే రోజు అసెంబ్లి కూడా సమావేశం కానున్నది. అసెంబ్లీ సమావేశానికి ముందే ఏపీ కేబినెట్‌ భేటీ కావాలని నిర్ణయించింది. ఈనెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలియజేశారు.

గతంలో సమయాభావం వల్ల ప్రవేశపెట్టలేక పోయిన మూడు బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. అందుకుగానూ ముందుగా ఈ మూడు బిల్లులపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం చేయాల్సిన ప్రకటనపై చర్చించనున్నారు.

ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం నియమించిన జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు నివేదికలు ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ప్రభుత్వం హైపవర్‌ నియమించిన కమిటీ వరుస భేటీలను నిర్వహిస్తోంది. ఇప్పటికే మూడు సార్లు భేటీ అయిన కమిటీ మరో భేటీకి కూడా సిద్ధమవ్వాలని నిర్ణయించింది. సీఆర్డీయే చట్టసవరణపై చర్చించనున్నారు.

సీఆర్డీయే చట్టాన్ని రద్దుచేయాల్సివచ్చినప్పుడు దానిస్థానంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రయోజనం చేకూర్చేలా సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆల్‌ రీజియన్స్‌ యాక్ట్‌- 2020 తీసుకురావాలని యోచిస్తోంది.

పరిపాలనా రాజధానిగా విశాఖను, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అధికార, పరిపాలనా వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు అధికారిక వర్గాలద్వారా తెలిసింది.

రాష్ట్రాన్ని మూడు భాగాలుగా (జోన్లు)గా విభజించి, ప్రతి జోన్‌కు డెవలప్‌మెంట్‌ బోర్డును నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బోర్డులో 9 మంది సభ్యులను నియమించి ఆయా జోన్ల పరిధిలో అభివృద్ధి, సంక్షేమాన్ని పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. ఈ బోర్డుకు ముఖ్యమంత్రి ఎక్స్‌ అఫిషీయో వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

అలాగే ఒక పార్లమెంటు సభ్యడు, ఇద్దరు శాసనసభ్యులు, వివిధ రంగాల్లో అనుభవం కలిగిన నలుగురు నిష్ణాతులను ప్రభుత్వం సభ్యులుగా నియమించనుంది. ప్రతి జోన్‌ కమిటీకి పూర్తిస్థాయి కార్యదర్శి ఉండనున్నారు. ఈ కార్యదర్శి ప్రిన్సిపల్‌ సెక్రటరీ హోదా కలిన అధికారిని రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది.

పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ఉద్దేశించిన లక్ష్యాలతో, జోన్లలోని వివిధ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కేంద్రాలు, శాఖలు, పరిశోధనా కేంద్రాలు వంటివాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ప్రతి జోన్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సీట్‌ ఆఫ్‌ అథారిటీని ఏర్పాటు చేయనుంది.
 
హైపవర్‌ కమిటీ సూచనలపై చర్చ 
ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమైన హైపవర్‌ కమిటీ తన సిఫార్సులను ముఖ్యమంత్రి ముందు ఉంచనుంది. ఈ నేపథ్యంలో హైపవర్‌ కమిటీ చేసిన సిఫార్సులపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించనున్నారు.

ముఖ్యంగా మూడు రాజధానుల అంశంపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈమెయిల్‌ ద్వారా ప్రభుత్వానికి వారివారి సూచనలు, సలహాలను పంపాలని ఇప్పటికే కమిటీ ప్రకటన చేసింది. ప్రభుత్వానికి వస్తున్న వినతులు, సూచనలు, సలహాలపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

వీటన్నింటిపైనా కూలంకుషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు భేటీలో చర్చచేయనున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ప్రభుత్వం నిర్ణయం ఉందనిపించేలా తమ ప్రకటన ఉండబోతోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.