శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (07:22 IST)

స్పందించాల్సింది ఏపీ ప్రజలే.. 3 రాజధానుల అంశంపై కేటీఆర్

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై మంత్రి, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కె.తారకరామారావు స్పందించారు. ఏపీలో 3 రాజధానుల అంశంపై స్పందించాల్సింది ఏపీ ప్రజలు మాత్రమేనని చెప్పారు. 'ఆస్క్‌ కేటీఆర్‌' పేరుతో ట్విట్టర్‌లో ఆయన సమాధానాలు చెప్పారు. ట్విట్టర్ వేదికగా మంత్రి కే .తారక రామారావు ప్రజలతో సంభాషించారు .

ఈ సందర్భంగా అయన పలు అంశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపైన, వ్యక్తిగత అంశాలు, అభిరుచులపైన ప్రజలకు సమాధానాలిచ్చారు. హ్యష్ ట్యాగ్ చాలసేపు దేశంలో ట్విట్టర్ ట్రెండింగ్ లో నంబర్ వన్ గా నిలిచింది. ప్రస్తుత రాజకీయాలపైనా మంత్రి కెటియార్ స్పందించారు. 
 
రాష్ర్టంలో పౌర సవరణ చట్టం అమలుపైన ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఈ చట్టాన్ని పార్లమెంట్లో వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.  రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ హిందూ- ముస్లిం కమ్యూనల్ కార్డు ని వాడుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు ఏం చేస్తారని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ప్రజలను విభజించే ఏలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివైన వారు తెలంగాణ ప్రజలని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలతో పోల్చితే శాంతియుతమైనదని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. నగరంలో శాంతియుత ధర్నాలకు అనుమతుల విషయాన్ని అడగగా, కొద్దిరోజుల సమయంలోనే ఆర్ఎస్ఎస్, ఎంఐఎం లాంటి సంస్థలు తమ  కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.

దేశంలో నలభై ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత, ఐదు త్రైమాసికాల్లో వరుసగా తగ్గుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలను చేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా, ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అవి స్వల్ప కాలం మాత్రమే సక్సెస్ అవుతాయని, అంతిమంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక అభివృద్ధి వంటి కఠిన ప్రశ్నలకు ఖచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల పాలనపైన  స్పందించిన కేటీఆర్ “ ఒక మంచి ప్రారంభం” అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు సరైందో కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుందన్న కామెంట్లు చేసిన పలువురు, ఆంధ్ర రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేయాలని కోరడం, ఈ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని  ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిపినందుకు సంతోషంగా ఉందన్నారు.
 
రాష్ట్రంలో  బలమైన ప్రతిపక్షం లేకున్నా, తమ 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పని తీరుపై తమకు అవసరమైన ఫీడ్బ్యాక్ వస్తుందని కేటీఆర్ అన్నారు. 2009లో  రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నుంచి, 2019లో మంత్రి స్థాయిలో పాలన చేస్తున్న పరిస్థితి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని “టెన్ ఇయర్ చాలెంజ్”  అంటూ  స్పందించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల కృషి వల్లనే తనకు మంత్రి పదవి దక్కిందన్న కేటీఆర్,  మంత్రి పదవి కన్నా తనకు పార్టీ పదవే విలువైనది అని తెలిపారు. తనను అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు  ముఖ్యమంత్రి కెసిఆర్ గారే అన్నారు. 2019  సంవత్సరంలో అన్ని జిల్లా పరిషత్ లను గెలుచుకోవడం ఒక  మంచి జ్ఞాపకం అన్నారు.
 
హైదరాబాద్ నగర అభివృద్ధి పథం భవిష్యత్తులోనూ కొనసాగుతున్నదన్న నమ్మకాన్ని కెటియార్ వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం ప్రారంభమైందని త్వరలోనే మార్పు కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నీతి అయోగ్ చెప్పిందన్న ఒక ప్రశ్నకు సమాధానంగా, స్పందించిన కెటియార్, ఇతర  నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో నీటి  కొరత చాలా తక్కువగా ఉన్నదని కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా సమస్య తలెత్తదని తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించామని, చార్మినార్, గోల్కొండ లకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, యూరప్, అమెరికా వంటి ప్రాంతాల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, భవిష్యత్తుకి అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో నూతనంగా 50 పుట్  ఒవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని, స్కై వాక్స్ నిర్మాణాలకు అమోదం తెలిపామన్నారు. హైదరాబాదులో ఈ బి ఆర్ టి ఎస్ పద్ధతిలో కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే  ప్రణాళిక ప్రారంభమైందన్నారు.

పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని తెలిపారు. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకువెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తుందని తెలిపారు. గోపనపల్లి లో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్ కమ్యూనిటీ లకు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్ రోడ్డు నిర్మాణంలో కవర్ చేస్తామన్నారు.

ఎల్బీనగర్లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్ పూర్తయిందని మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు వస్తాయన్నారు. 111 జీవోలో ఏదైనా మార్పు, చేర్పులు అవసరమైతే ఉస్మాన్సాగర్ హిమాయత్సాగర్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతగిరి, వికారాబాద్ ప్రాంతాలను గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నకు ఈ ప్రాంతాల అభివృద్దికోసం అనేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటి ఫలాలు త్వరలో చూస్తారని మంత్రి స్పందించారు
 
సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి నేరుగా స్పందన తెలుస్తుందని, తన పైన మర్యాద పూర్వకమైన మీమ్ లు (హస్యపూరిత చిత్రాలు) వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది  లేదన్నారు. ఇప్పటికే దాదాపు అందరు మంత్రులు సోషల్ మీడియాలో చురుగ్గా భాగస్వాములయ్యారన్నారు. సినిమాల్లో నటించి సామాజిక సందేశం ఇవ్వాలని కోరగా, ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ తనకు  ఫుల్ టైం జాబ్ ఉన్నదని తెలిపారు.

చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానిని అన్నారు. ప్రస్తుత తరం నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని,  ప్రపంచంతో ఎక్కువగా కనెక్ట్ అయిందని, అంత్రప్రెన్యూరల్  లక్ష్యాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యం విద్య పట్టణ గ్రామీణ మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు.

అంతర్జాతీయ స్థాయి తయారీ రంగ కంపెనీల నుంచి హైదరాబాద్ తీసుకు వస్తామని ఇప్పటికే, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. 2020లో ఫార్మాసిటీ ప్రారంభమవుతుందన్నారు.

హైదరాబాద్ లో రెండవ దశ టిహజ్ మరియు టీ వర్క్స్, 2020 మొదటి అర్ధ సంవత్సరంలో పూర్తవుతాయన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా అనేక ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయని, ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటిస్తుందని, పట్టణాభివృద్ధితో పాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
 
నూతన మున్సిపల్ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, మున్సిపల్ అధికారుల విచక్షణతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు తన మునిసిపల్ శాఖ అధికారులతో నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్ యార్డులు, వేస్టు టూ ఎనర్జీ  ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు.