శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 మార్చి 2018 (15:01 IST)

చంద్రబాబును ముఖ్యమంత్రి చేసింది మేమే: బీజేపీ ఎమ్మెల్యే

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధిపత్యపోరు తారా స్థాయికి చేరింది. ఒకవైపు అవిశ్వాస తీర్మానం అస్త్రంతో బీజేపీకి టీడీపీ ముచ్చెమటలు పోయిస్తోంది. దీని నుంచి తప్పించుకునేందుకు అన్నాడీఎంకే అస్త్రాన్ని బీజేపీ

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధిపత్యపోరు తారా స్థాయికి చేరింది. ఒకవైపు అవిశ్వాస తీర్మానం అస్త్రంతో బీజేపీకి టీడీపీ ముచ్చెమటలు పోయిస్తోంది. దీని నుంచి తప్పించుకునేందుకు అన్నాడీఎంకే అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించింది. మరోవైపు, టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం కూడా రోజురోజుకీ పెరుగుతోంది. బీజేపీపై టీడీపీ నేతలు, టీడీపీపై బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ శాసనసభలో సభ్యుడిగా ఉన్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ, పవన్‌కల్యాణ్‌ అండతోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని, లేకపోతే జగన్‌ సీఎం అయి, చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చునేవాడని వ్యాఖ్యానించారు. టీడీపీ మిత్రపక్షం కాబట్టే ఇంతకాలం సంయమనంతో వ్యవహరించామన్నారు. 
 
విశాఖలో జరిగిన భూకుంభకోణాలు తన వల్లే బయటకు వచ్చాయని, సిట్‌ ఏర్పాటుకు ప్రధాన కారణం తానేనన్నారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీయే ప్రతిపక్ష పాత్రను పోషిస్తోందని చెప్పారు. టీడీపీ నాయకుల అవినీతి పెరిగిపోయిందని, ఇసుక మాఫియాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. విశాఖ కేంద్రంగా ఈ ఏడాదే రైల్వేజోన్‌ ఏర్పాటు అవుతుందని స్పష్టంచేశారు.