మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (14:08 IST)

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందనీ... కన్నబిడ్డను చంపేసింది

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందని భావించిన ఓ కసాయి తల్లి తన రెండేళ్ళ బిడ్డను హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు కూడా సహకరించాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో జరిగింది.

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందని భావించిన ఓ కసాయి తల్లి తన రెండేళ్ళ బిడ్డను హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు కూడా సహకరించాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన శాంత (22) అనే మహిళ ఓ రికార్డింగ్ డ్యాన్సర్. నాలుగేళ్ల క్రితం బోయకొండ శ్రీనివాసులు అనే యువకుడిని పెళ్లాడింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత అతన్ని వదిలేసి, మదనపల్లికి చెందిన డాన్స్ గ్రూపులో చేరి, అదే గ్రూపులో డ్యాన్సులు చేసే శ్రీనివాసులుతో సహజీవనం సాగిస్తోంది.
 
వీరిద్దరూ గ్రామాల్లో పండగలు, పబ్బాలకు జరిగే రికార్డింగ్ డ్యాన్సుల్లో పాల్గొంటూ, తద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 23వ తేదీన పుంజనూరు మండలం గాలిమిట్టకు వెళ్లిన ఇద్దరూ, తమ వెంట జ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల కుమార్తె శివానిని కూడా తీసుకెళ్లారు. ఆపై మద్యం తాగి, ఒళ్లు తెలియకుండా డ్యాన్సులు వేస్తున్నారు. 
 
ఆ సమయంలో జ్వరంతో బాధపడుతున్న బిడ్డ ఏడుపు వినిపించింది. అంతే, ఒక్కసారిగా శాంతకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాపను చంపేయాలని తన ప్రియుడిని కోరింది. వెంటనే శ్రీనివాసులు ఆ చిన్నారి గొంతు పిసికి, ఆటో కమ్మీకి బలంగా కొట్టగా, ఆ పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత మృతదేహానికి దుప్పటి చుట్టి మురుగు కాలువలో పడేశారు. 
 
ఈ విషయం మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శాంతతో పాటు.. ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.