మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 జనవరి 2018 (14:53 IST)

సిమెంట్ రోడ్లతో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయ్ : చంద్రబాబు

గ్రామీణ ప్రాంతాల్లో బురద అవుతోందని సిమెంట్ రోడ్లు నిర్మిస్తుంటే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక సమస్యను పరిష్కరిస్తుంటే మరో సమస్య వస్తోందని ఆయన ఆవేదన వ్

గ్రామీణ ప్రాంతాల్లో బురద అవుతోందని సిమెంట్ రోడ్లు నిర్మిస్తుంటే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక సమస్యను పరిష్కరిస్తుంటే మరో సమస్య వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఒకరోజు టీడీపీ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడుతూ, నేడు అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తున్నాయని, మట్టి రోడ్లు కనిపించడం లేదని అన్నారు. ‘నేను మా ఊరు వెళ్లినప్పుడు చూస్తే.. అక్కడ రోడ్లు అన్నీ సిమెంట్ రోడ్లుగా మారాయని, ఎక్కడా ఒక మట్టిరోడ్డు కూడా కనిపించడం లేదన్నారు. 
 
అయితే, గ్రామాల్లో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు కావడంతో మోకాళ్ల నొప్పుల సమస్య తలెత్తుతుందని, ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగిన తీరుపై మరోమారు ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించడం వల్లే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని విమర్శించారు. 
 
ఇకపోతే, ఏపీలో టీడీపీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. ఎన్నికలంటే గతంలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి ఉండేవని, ఇప్పుడు అలా లేదని, పనితీరునే ప్రజలు ప్రమాణంగా తీసుకుంటున్నారని అన్నారు.
 
నేతల పనితీరు బాగుంటే ప్రజలు నిరంతరం ఆదిరిస్తారని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకులు ప్రణాళికలు రచించుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలకు ఇకపై కష్టకాలమేనని, పనిచేయకపోతే వారికి ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. 
 
ఈ మూడు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పనితీరు మార్చుకోని పరిస్థితిలో ‘నేను వచ్చి మీ దగ్గర నిరాహారదీక్ష చేస్తా, అప్పుడైనా మీపై ఒత్తిడి పెరుగుతుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ గతంలో ఇదే పద్ధతిని అనుసరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.