మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (08:26 IST)

ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులు

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్‌సభ, తెలంగాణాలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. వీటితో పాటు ఏపీ శాసనసభకు కూడా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటుచేశారు. 
 
అయితే, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును ఉండవల్లిలో వినియోగించుకున్నారు. చంద్రబాబుతో పాటు.. ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణిలు ఉన్నారు. వీరింతా ఉండవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 
 
ఓటు వేసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాము ఉపయోగించుకున్నట్టే ప్రతి కుటుంబలోని సభ్యులంతా ఓటు హక్కును తప్పనిరిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఓటు వేస్తున్నారన్నారు. ముఖ్యంగా, భవిష్యత్ మారాలంటే ఓటు వేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 
 
ఆ తర్వాత నారా లోకేశ్ మాట్లాడుతూ, ఈ రోజు చాలా కీలకమైన, పవిత్రమైన రోజన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళలో నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. దిశ నిర్దేశం చేసే ఎన్నికలనీ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.