గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (09:29 IST)

పయ్యావులా? కేసీఆర్‌తో నీకెందుకంత సాన్నిహిత్యం?: చంద్రబాబు క్లాస్

పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌పై ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మీకెందుకంత సాన్నిహిత్యం అంటూ పయ్యావులను చంద్రబాబ

పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌పై ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మీకెందుకంత సాన్నిహిత్యం అంటూ పయ్యావులను చంద్రబాబు ప్రశ్నించారు. పైగా, సీఎంగా, ఓ పార్టీ అధినేతగా ఉన్న తానే కేసీఆర్‌తో కరచాలనం చేసి 2 నిమిషాల కంటే ఎక్కువ సేపు మాట్లాడలేదని గుర్తుచేశారు. 
 
కాగా, శ్రీరామ్ వివాహ సమయంలో కేసీఆర్, పయ్యావుల దాదాపు పావుగంట సేపు దూరంగా నిలబడి మాట్లాడుకోవడం చర్చనీయాంశమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమైన వేళ, రేవంత్ రెడ్డి, ఎల్.రమణ తదితరులు ఈ విషయాన్ని ప్రస్తావించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
దీంతో తాజాగా జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పయ్యావులకు చంద్రబాబు క్లాస్ పీకినట్టు సమాచారం "తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ ఉంది. అక్కడి వాళ్ల మనోభావాలను మనం గౌరవించాలి. నేను, కేసీఆర్ కూడా కలుసుకున్నాం. ఒకచోట ఎదురుగా వచ్చి, రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆపై ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోయాం. కానీ మన మంత్రులు, నేతలు పరిధులు దాటి ఆయనతో దగ్గరగా మెసిలారు" అంటూ అసహనాన్ని వ్యక్తంచేశారు.
 
దీనిపై తెలంగాణ పార్టీ నేతలు తనవద్ద అభ్యంతరాలను వ్యక్తం చేశారని అంటూ, "పయ్యావుల సీనియర్. ఆయనకు కేసీఆర్ తో ఏకాంత సమావేశాలు ఎందుకు? ఏం సందర్భం ఉంది? పెద్ద నేతలు కూడా ఇలా చేస్తే ఎలా? తెలంగాణలో రాజీనామాలు చేసి వెళతామంటున్నారు" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై పయ్యావుల తీవ్ర అసహనం వ్యక్తంచేయడమే కాకుండా, ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి రాజీనామా చేస్తానని తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.