శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (09:11 IST)

కొడుకు భవిష్యత్ కోసం తెరాసలో చేరనున్న సబితా ఇంద్రారెడ్డి!

తన కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, చేవెళ్ళ చెల్లెమ్మగా పేరుబడిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు.. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా తెరాస తీర్థంపుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ కూడా పార్టీలో చేరనున్నారు. 
 
ఇదే విషయంపై ఆదివారం ఎంఐఎం అధినేత, హైదరాబాద్ తాజా మాజీ ఎంపీ అసదుద్దీన్‌ నివాసంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సబిత ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డిలు సమావేశమయ్యారు. వీరంతా కలిసి పార్టీ మార్పుపై చర్చించారు. ఫలితంగా సబితమ్మ పార్టీ మార్పుపై కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. కాగా, ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య అధికార తెరాసలో చేరనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆ మరుసటిరోజే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్‌ ఇవ్వడం కాంగ్రెస్‌ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. కేటీఆర్‌తో భేటీలో సబితతోపాటు ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ పాల్గొన్నారు. సుమారు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో తెరాసలో చేరిన పక్షంలో ఇచ్చే ప్రాధాన్యంపై చర్చ జరిగినట్లు సమాచారం.