1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (11:10 IST)

మోకాళ్లపై నిలబడి, చేతులు జోడించి సారీ చెప్పిన ఎమ్మెల్యే.. ఎందుకు?

రాజకీయ నాయకులు అంటే పూటకో మాట.. గడపకో హామీ ఇస్తూ తమ పబ్బం గడుపుకునేవారనీ భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కానీ ఈ ప్రజాప్రతినిధి అలా కాదు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానంటూ మోకాళ్ళపై నిలబడి, చేతులు జో

రాజకీయ నాయకులు అంటే పూటకో మాట.. గడపకో హామీ ఇస్తూ తమ పబ్బం గడుపుకునేవారనీ భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కానీ ఈ ప్రజాప్రతినిధి అలా కాదు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానంటూ మోకాళ్ళపై నిలబడి, చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అస్సోం రాష్ట్రంలోని మరియాని నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రూప్‌ జ్యోతి కుర్మి. ఈయన గిరిజన తెగకు చెందిన ఎమ్మెల్యే. ఈయన తండ్రి రూపమ్ కుర్మి ఆ రాష్ట్ర మాజీ మంత్రి. ఎన్నికల హామీలో భాగంగా మరియాని నియోజకవర్గంలోని నకచారి ఏరియాలోని మహాత్మాగాంధీ మోడల్ హాస్పిటల్ సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. 
 
ఈ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కమిటీకి అధ్యక్షుడిగానూ ఉన్న రూప్ జ్యోతి కుర్మి… ఆస్పత్రికి వచ్చే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సరైన వైద్యం అందటంలేదని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 8 మంది డాక్టర్లను హాస్పిటల్‌లో నియమించారు. అయితే రూప్ జ్యోతి కుర్మి హాస్పిటల్ సందర్శనకు వెళ్లినప్పుడు వారిలో ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో వైద్య సేవలు అందక రోగులు పడుతున్న ఇబ్బందులను దగ్గరుండి చూసిన ఎమ్మెల్యే విషయాన్ని ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ దృష్టికి తీసుకెళ్ళారు. 
 
ఈ ఫిర్యాదుకు స్పందించిన మంత్రి… విధులకు డుమ్మాకొట్టిన వైద్యుల జీతంలో ఒకరోజు వేతనాన్ని కత్తిరించాలని ఆదేశించారు. అప్పటికీ కూడా డాక్టర్ల ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే ఆస్పత్రిలోని రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందించడంలో విఫలమైనందుకు రోగుల ఎదుట మోకాళ్లపై నిల్చుని, చేతులు జోడించి క్షమాపణలు వేడుకున్నారు. నిత్యం ప్రజల్లో మమేకమయ్యే ఎమ్మెల్యే రూప్‌ జ్యోతి కుర్మి గతంలో కూలీలకు సాయం చేస్తూ గన్నీ బ్యాగులు మోశారు. ఓ సందర్భంలో రైతులకు సాయంగా పొలం కూడా దున్నారు.