శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (13:29 IST)

హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు రద్దు... ఆందోళనలో ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వీలుగా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో చర్యకు పూనుకుంది. తెలంగాణ ప్రాంతంలోని ఓటర్లు తమ సొంతూళ్ళకు వెళ్లకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
 
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఆంధ్రా ఓటర్లు ఉన్నారు. వీరంతా ఈనెల 11వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తమ సొంతూర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వీరిలో చాలామంది ప్రైవేట్ బస్సులనే నమ్ముకున్నారు. ఇందుకోసం పదో తేదీన బస్సుల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు. అయితే, ప్రభుత్వ సర్వీసులతో పాటు.. ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు చివరి నిమిషంలో బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నారు.  
 
ముఖ్యంగా, కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఏకంగా దాదాపు 125 బస్సు సర్వీసులను రద్దు చేసింది. ఇతర ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా కొన్ని బస్సులను రద్దుచేశాయి. సరిపడా డ్రైవర్లు లేనందున, సంస్థల్లోని ఇతరత్రా అంతర్గత కారణాల వలన యాజమాన్యాల బస్సులను రద్దుచేసినట్టు పేర్కొంది. దీంతో దాదాపు 200 వరకు బస్సులు నిలిచిపోయాయి. చివరి క్షణంలో ఇలా సర్వీసులు రద్దయ్యాయంటూ యాజమాన్యాలు చెప్పడంతో ఏపీకి వెళ్లాల్సిన ఓటర్లు ఏం చేయాలో తెలియక ఆందోళనలోపడ్డారు.