గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (22:51 IST)

క‌రోనా మరణాలు పూర్తిగా తగ్గించాలి: ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

కడప జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మెరుగైన వసతులు కల్పించి జిల్లాలో కరోనా మరణాలు  పూర్తిగా తగ్గించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష పేర్కొన్నారు.

మంగళవారం ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాష జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రి ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంజాద్ భాష మాట్లాడుతూ దేవుని దయ.. త‌న‌ను అభిమానించే ప్రజల దీవెనల వల్ల కరోనాను జయించి బయటికి రావడం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కోవిడ్ -19 ఆస్పత్రులలో కరోనా పేషెంట్లకు మెరుగైన వసతులతో పాటు మంచి భోజనం అందించేందుకు అధిక నిధులు ఖర్చు  చేస్తున్నారన్నారు. జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం, వార్డులలో మెరుగైన వసతులు సరిగా లేవన్నారు.

కొన్ని గ‌దుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని  పేషెంట్లు తమకు తెలిపారన్నారు. ఈమధ్య రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మంచి వైద్యం, భోజన వసతి సరిగా  లేదని తమ దృష్టికి రావడంతో  నేడు రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఇక నుంచి ప్రభుత్వ మెనూ ప్రకారం కరోనా పేషెంట్లకు భోజన వసతులు కల్పించాలన్నారు.

మనది సీఎం  జిల్లా ఇక్కడ పనిచేసే  అధికారులందరూ బాగా పని చేసి పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించి కరోనా మరణాలు పూర్తిగా తగ్గించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనన్నారు. కరోనా పేషెంట్ లందరికీ ఆక్సిజన్‌తో కూడిన బెడ్‌ల వ‌సతి కల్పించేందుకు కోవిడ్-19 ఆస్పత్రిలో బెడ్ ల సంఖ్య పెంచడం జరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి జగన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో ఎక్కువ కరోనా టెస్ట్ లు చేయించి కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. కరోనా టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల పాజిటివ్ కేసులు అధికంగా బయటపడుతున్నాయన్నారు. దీంతో ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు.

5న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లా పర్యటన ఉంటుందన్నారు. మంత్రి ఆధ్వర్యంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా నివారణ పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ ప్రసాద్‌రావు, ఆర్.ఎం.కొండయ్య, మెడికల్ ఆఫీసర్ రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.