శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 30 మే 2019 (12:00 IST)

కాపురంలో చిచ్చుపెట్టిన మటన్ ముక్క... ఎలాగంటే?

నేటి ఆధునిక కాలంలో భార్యభర్తల మధ్య సంబంధాలు చాలా చిన్న విషయాలకే దెబ్బ తింటున్నాయి. సాధారణంగా అయితే భర్త తాగొచ్చి కొడుతున్నాడని, పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకున్నారని, వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసే భార్యలను మనము చూసాము. కానీ హైదరాబాద్‌లో ఓ భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనకు కారణం తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. 
 
వివరాలను పరిశీలిస్తే, రహ్మత్‌నగర్‌కు చెందిన యువతి, సైదాబాద్‌కు చెందిన యువకుడు వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు.

విషయం ఇంట్లో చెప్పగా ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆర్నెళ్ల క్రితం ఇరు కుటుంబాలు వీరిద్దరికీ ఘనంగా పెళ్లి చేశారు. అయితే భర్తతో పాటుగా అతని కుటుంబీకులు పూర్తిగా శాకాహారులు కాగా.. అమ్మాయికి మంసాహారం లేనిదే పూట గడవదు. పెళ్లి ముందే ఆ అబ్బాయి తాను నాన్‌వెజ్ తిననని, ఆ వాసన కూడా పడదని అమ్మాయికి చెప్తే, దానికి ఆమె సరేనంది.
 
పెళ్లి తర్వాత నాలుగు నెలలు సజావుగా సాగిన వీరి కాపురంలో మాంసాహారం కలతలు రేపింది. ఆమె ఓ రోజు ఇంట్లో మటన్ వండుతానని పట్టుబట్టింది. ఇందుకు భర్తతో పాటు అత్తమామలు కూడా ససేమీరా అన్నారు. నీకు తినాలనిస్తే ఫ్రెండ్స్‌తో వెళ్లి బయట తినేసి రా, లేదంటే ఇంటికి తెప్పించుకుని తిను, అంతేగానీ ఇంట్లో మాత్రం వండటం కుదరదని తెగేసి చెప్పారు.

ఈ సంఘటనతో పాటుగా మరోసారి భర్తను మటన్ ముక్క తినమని ఒత్తిడి చేయగా దానికి అతడు ఒప్పుకోకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణం ‘మటన్ ముక్క’ అని తెలుసుకుని షాకయ్యారు. దీంతో దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా ఫలితం లేకపోవడంతో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు రెఫర్ చేసారు.