గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (18:31 IST)

గుంటూరులో డెంగీతో డాక్టర్‌ మృతి

గుంటూరులో సీనియర్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ అలపర్తి లక్ష్మయ్య డెంగీ జ్వరంతో శనివారం మృతి చెందారు. ఈ ఘటన నగర వైద్య వర్గాల్లో కలకలం రేపింది.

నగరంపాలెంలోని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ ఇంటి ఎదుటే సదరు వైద్యుడు నందన హాస్పిటల్‌ పేరిట వైద్యశాలను నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల కిందట డాక్టర్‌ లక్ష్మయ్య జ్వరంతో బాధపడుతూ అరండల్‌పేటలోని ప్రైవేటు వైద్యశాలలో చేరారు. అక్కడి వైద్య పరీక్షల్లో డెంగీ జ్వరంగా నిర్ధారణ అయ్యింది.

రెండు రోజుల కిందట పరిస్థితి విషమించడంతో విజయవాడ సమీపంలోని మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. లక్ష్మయ్య మృతి పట్ల నగర ఐఎంఏ కార్యవర్గం సంతాపం వ్యక్తం చేసింది.
 
ఈ విషయం తెలిసిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు రంగంలోకి దిగి డీఎంహెచ్‌వో ఇంటి పరిసరాల్లో ఫాగింగ్‌, దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపట్టారు. డాక్టర్‌ లక్ష్మయ్య నివసించే బృందావన్‌ గార్డెన్స్‌ పరిసర ప్రాంతాల్లో కూడా ఫాగింగ్‌, ఫీవర్‌ సర్వే చేపట్టారు.

కాగా, యూరాలజిస్ట్‌ డాక్టర్‌ అలపర్తి లక్ష్మయ్య డెంగీతో మృతిచెందిన విషయం తమ దృష్టికి వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జె.యాస్మిన్‌ వెల్లడించారు. డెంగీ నివారణకు చర్యలు చేపడతామన్నారు. కాగా, గుంటూరులో మరో ఇద్దరు వైద్యులు, ఒక వైద్య విద్యార్థి కూడా డెంగీతో బాధపడుతున్నారు.

వీరిలో ఒక డాక్టర్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిసింది. డెంగీ రోగులను ఐసీయూలో ఉంచి చికిత్సలు చేస్తున్న సమయంలో డాక్టర్లు ఆయా రోగులను దోమ తెరల మధ్య ఉంచాలి. దీనివల్ల ఆ రోగుల నుంచి డెంగీ కారకాలు డాక్టర్లకు వ్యాపించకుండా ఉంటాయి.

అయితే, చాల మంది వైద్యులు డెంగీ రోగులకు కూడా సాధారణ రోగుల్లానే చికిత్సలు చేస్తున్నారు. దీనివల్ల వైద్యులు, సిబ్బంది డెంగీ బారిన పడుతున్నట్లు భావిస్తున్నారు.