గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 28 ఆగస్టు 2018 (21:55 IST)

ఏపీ నుంచి కేరళ వరద బాధితులకు భారీ విరాళాలు...

ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.కె. భట్టాచార్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబుతో భట్టాచార్యతో పాటు ఇతర అధికారుల బృందం, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ బి. సూర్యబాబులు సమావేశమ

ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.కె. భట్టాచార్య  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని నివాసంలో  సీఎం చంద్రబాబుతో భట్టాచార్యతో పాటు ఇతర అధికారుల బృందం, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్  బి. సూర్యబాబులు సమావేశమయ్యారు. కేరళ వరద బాధితులకు ఇండియన్ బ్యాంక్ ప్రాయోజిత సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.14,83,336 ల చెక్కును సీఎం చంద్రబాబుకు భట్టాచార్య, సూర్యబాబులు అందజేశారు. 
 
ఈ వితరణ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంవోయు జరిగిన మేరకు రూ. 5 వేల కోట్ల రుణం మంజూరుకు సత్వర చర్యలపై భట్టాచార్య స్పష్టమైన హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో  ఏపీ శీఘ్రంగా అభివృద్ధి చెందుతోందని భట్టాచార్య అభినందించారు. రాష్ట్రంలో అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని భట్టాచార్య భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్న భట్టాచార్య స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి. కుటుంబ రావు కూడా పాల్గొన్నారు.
 
బద్వేలు ఎమ్మెల్యే జయరాములు రూ. 6 లక్షలు
కేరళ వరద బాధితుల సహాయార్థం రూ. ఆరు లక్షల విరాళాన్ని చెక్ రూపంలో  సీఎం చంద్రబాబుకు బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు అందజేశారు. ప్రజావేదికలో సీఎం చంద్రబాబును జయరాములుతో పాటు పీపుల్ ఎగనెస్ట్ కరప్షన్ సభ్యులు కలిసారు. ఇప్పటికే రూ.24 లక్షల విలువైన సానిటరీ పాడ్స్, మందులు కేరళకు పంపామని చెప్పిన పీపుల్ ఎగనెస్ట్ కరప్షన్ సభ్యుల సేవాతత్పరతను సీఎం చంద్రబాబు అభినందించారు. కేరళ బాధితులకు సాయం అందించడంలో కడపవాసులైన పీపుల్ ఎగనెస్ట్ కరప్షన్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, మహేంద్రనాథ్ రెడ్డి, ఉత్తంరెడ్డిల ఉదారత ప్రశంసనీయమని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు.
 
విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విరాళం రూ.13.80 లక్షలు 
కేరళ వరద బాధితుల సహాయార్థం రూ.13.80 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు రాష్ట్ర విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ గౌతం సావంగ్ అందజేశారు. డీజీ గౌతం సావంగ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును విజిలెన్స్ & ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు, సిబ్బంది కలిశారు. ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నట్లు సీఎంకు వివరించారు. ఈ విరాళాన్ని కూరలు పంపాలని కోరారు.  
 
కేరళ వరద బాధితుల సహాయార్థం నరెడ్కో రూ.50 లక్షల విరాళం
కేరళ వరద బాధితుల సహాయార్థం రూ.50 లక్షల విరాళాన్ని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) -ఏపీ శాఖ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందజేసింది. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎం చంద్రబాబును నరెడ్కో ప్రతినిధులు కలిసారు. కేరళ వరద బాధితులకు సాయం చేయడంలో సీఎం చంద్రబాబు మానవతాదృక్పథంతో వ్యవహరిస్తున్నారన్న మురళీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలకు కేరళ ప్రజల జీవితాలు కకావికలమవడం పట్ల ముఖ్యమంత్రి వద్ద ఆవేదన  వ్యక్తం చేశారు. 
 
మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి, మంత్రులు కేరళ వరద బాధితులకు ఉదారంగా వ్యవహరిస్తూ తగిన ఆర్ధిక, మానవ వనరుల సాయం అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు స్పూర్తితో ప్రభావితమై కేరళ వరద బాధితులకు విరాళం ఇస్తున్నామన్న నరెడ్కో అధ్యక్షులు లహరి హరిబాబు తెలిపారు. సమాజంలో తమ వంతు కర్తవ్యంగా సాటి ప్రజలను ఆదుకోవాలన్న సానుభూతితో  ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఆపన్నహస్తం అందించాలన్న దృక్పతంతో 1200 మంది సభ్యుల నుంచి విరాళాలు సేకరించినట్లు నరెడ్కో అధ్యక్షులు లహరి హరిబాబు సీఏఎంకు తెలిపారు. ఈ వితరణ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని నరెడ్కో కోఆర్డినేటర్ కిరణ్ పరుచూరి, ఎన్. శ్రీ నగేష్, జీఎస్సెస్ ప్రసాద్‌లు విన్నవించారు.