గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 8 డిశెంబరు 2018 (14:37 IST)

భార్య, కూతుర్ని సంతలో వేలానికి పెట్టిన భర్త... ఎక్కడ?

ఆర్థిక ఇబ్బందులు భరించలేక పోయింది ఆ కుటుంబం. చాలీచాలని జీతంతో జీవితాన్ని సాగించలేకపోయారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఇక జీవితం మారదన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో భర్తను ఒప్పించి వేలం పెట్టమని ప్రాధేయపడ్డారు భార్య, కూతురు. సభ్య సమాజం నివ్వెరపోయేలా జరిగిన సంఘటన చిత్తూరు జిల్లా జి.డి. నెల్లూరులో జరిగింది. 
 
వెంకటేష్‌, పద్మావతిలది అనంతపురం జిల్లా. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో బంధువులుంటే ఇక్కడకు వలస వచ్చారు. వీరికి 18 సంవత్సరాల కుమార్తె శిరీష ఉంది. వెంకటేష్‌ స్థానికంగా ఉన్న కోళ్ల ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేసేవాడు. వచ్చే జీతం ఇంటికి సరిపోయేది కాదు. ఆర్థిక ఇబ్బందులతో స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు. ఆరు నెలల పాటు చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. దీంతో ఇంట్లో భార్య పద్మావతి నగలను అమ్మి కాస్త వడ్డీలను చెల్లించాడు.
 
తన నగలు అమ్మడంతో పద్మావతి ఆగ్రహంతో ఊగిపోయింది. అప్పులు బాధ భరించడం కన్నా చావడం మంచిదంది. అయితే అందుకు ఒప్పుకోలేదు వెంకటేష్‌. నన్ను, నీ కూతుర్ని వేలం పెట్టు ఎవరో ఒకరు కొంటారు. ఆ డబ్బుతో అప్పులు కట్టేయ్. మనకు ఈ బాధలు వద్దంటూ బోరున విలపించింది. దీంతో వెంకటేష్‌ మరో మాట మాట్లాడకుండా జి.డి. నెల్లూరులో సంతలో ఇద్దరిని తీసుకొచ్చి నిలబెట్టాడు. కొంతమంది రైతులు అటుగా వెళుతుంటే భార్య, కూతుర్ని అమ్మేస్తున్నాను రేటు మాట్లాడమన్నాడు. 
 
దీంతో ఆశ్చర్యపోయిన రైతులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబం మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటాయి. అలాగని ఇలాంటి పనులు చేయడం తప్పంటూ వెంకటేష్‌‌ను హెచ్చరించి పంపేశారు పోలీసులు.