శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2019 (11:48 IST)

పెళ్లాడి ఎనిమిదేళ్ళు, భార్యను భర్త పక్కన పడుకోనివ్వని అత్త, ఎందుకు?

కులాంతర వివాహం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగస్తులైనా కులం తక్కువ అమ్మాయిని చేసుకుందని అత్త ఆమెపై కక్ష కట్టింది. పిల్లలు కంటే ఆత్మహత్య చేసుకుంటానని కొడుకుని బెదిరించి కాపురం చేయనీయకుండా అడ్డుకుంది. ఇదంతా ఒకరోజు, రెండు రోజులు కాదు ఏకంగా ఎనిమిది సంవత్సరాల పాటు జరుగుతున్న తతంగం.
 
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నగరంలోని ముత్యాలమ్మగుడి వీధి. రమణయ్య, సుబ్బలక్ష్మమ్మ భార్యాభర్తలు. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కుప్పంలో పనిచేసే సమయంలో ఇద్దరూ కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళయిన రెండురోజులకే ఇద్దరూ శ్రీకాళహస్తికి బదిలీ చేసుకున్నారు.
 
ఇంకేముంది.. తన సంసారం ప్రశాంతంగా సాగుతుందని.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టానని మురిసిపోయింది సుబ్బలక్ష్మమ్మ. కానీ ఆమెకు అత్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. రమణయ్య అగ్ర కులానికి చెందినవాడు. సుబ్బలక్ష్మమ్మ బీసి. దీంతో ఈ వివాహం రమణయ్య తల్లికి ఇష్టం లేదు. పెళ్ళికి కూడా ఆమె వెళ్ళలేదు. అంతేకాకుండా రమణయ్య సోదరుడు గోవిందస్వామి కూడా అన్న పెళ్ళికి వెళ్ళలేదు. కులం తక్కువ అమ్మాయితో కాపురం చేసి పిల్లలు పుడితే నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ తల్లి బెదిరించింది. దీంతో రమణయ్య భార్యను దూరంగా ఉంచాడు. 
 
భర్తతో పాటు వెళుతున్న సుబ్బలక్ష్మను అడ్డుకునేది రమణయ్య తల్లి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్ళ పాటు ఇదే తంతు. తనకు వచ్చే జీతాన్ని తీసుకోవడం.. అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు రమణయ్య. తన భర్తే కదా అని ఊరుకుంది సుబ్బలక్ష్మమ్మ. గత రెండురోజుల నుంచి తను వేరే మహిళను వివాహం చేసుకుంటానని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. 
 
పోలీసులకు ఆశ్రయించింది. రమణయ్యకు పలుకుబడి ఉండటంతో కేసు పెట్టలేదు. దీంతో తన ఇంటి ముందే మౌన పోరాటానికి దిగింది. పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఇంటి ముందే మౌనపోరాటం చేస్తోంది. ముఖ్యమంత్రికి లేఖ రాసింది. కలెక్టర్‌కు ఫోన్ చేసింది. తనకు న్యాయం జరగాలని.. తన భర్తతో తనను కాపురం చేయించాలని కోరుతోంది అభాగ్యురాలు.