శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (13:36 IST)

విజయారెడ్డి హత్య కేసులో బయటకువస్తున్న కీలక విషయాలు

తహశీల్దార్ విజయ రెడ్డి హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. వనస్థలిపురం ఏసీపీ జయరాం ను విచారణ అధికారిగా నియమించారు రాచకొండ కమిషనర్. విజయ రెడ్డి డ్రైవర్ గురునాథం మృతి చెదడంతో కేసులో పొందుపర్చిన సెక్షన్లు మార్పు చేశారు. ఐపీసీ 302,307, 333 అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
 
అయితే నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెపుతున్ననేపథ్యంలో సురేష్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. సురేష్ ఈ ఘటనకు ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్‌కి చెందిన స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించారు. హత్యకు ముందు కొద్దీ నిమిషాలు క్రితమే సురేష్ పెద్దనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లు తెలిసింది. 
 
వేరే వ్యక్తులతో మాట్లాడిన కాల్స్ రికార్డ్ చేసిన సురేష్ పెదనాన్న కాల్ ఎందుకు రికార్డు చేయలేదు అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికి సురేష్ తండ్రి కృష్ణ, పెద్దనాన్న దుర్గయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. తహశీల్దార్ హత్య తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో విచారణ సాగుతోంది. ఘటన స్థలంలో నిందితుడు సురేష్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 
 
అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. విజయారెడ్డిని కాల్చి చంపిన తర్వాత  దగ్గర్లో ఉన్న వైన్ షాప్ దగ్గర ఆగి ఉన్న కార్లో ఉన్న వారితో 5 నిమిషాలు సురేష్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. సురేష్ ఎవరితో మాట్లాడింది అన్న అంశాలు బయటకు రావాల్సి ఉంది.