శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (10:25 IST)

కుమారుడికి 'మరణ శిక్ష'... ఓ తండ్రి తీర్పు : ఎందుకో తెలుసా?

పెద్ద కుమారుడు తాగొచ్చి గొడవ చేస్తుండటాన్ని జీర్ణించుకోలేని ఓ తండ్రి.. చిన్న కుమారుడితో కలిసి కుమారుడికి మరణశిక్ష విధించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని కృష్ణానదిలో పడేసేందుకు వెళుతూ పోలీసులకు చిక్కిపోయి ఊచల

పెద్ద కుమారుడు తాగొచ్చి గొడవ చేస్తుండటాన్ని జీర్ణించుకోలేని ఓ తండ్రి.. చిన్న కుమారుడితో కలిసి కుమారుడికి మరణశిక్ష విధించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని కృష్ణానదిలో పడేసేందుకు వెళుతూ పోలీసులకు చిక్కిపోయి ఊచలు లెక్కిస్తున్నారు. పాలమూరు జిల్లా అడ్డాకులలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తాగుడుకు బానిసై ఇంట్లో తరచూ గొడవలకు దిగుతున్న పెద్ద కుమారుడిని ఓ తండ్రి, చిన్న కుమారుడి సాయంతో అతి కిరాతకంగా హతమార్చాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఈ హత్య మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం కందూరు సమీపంలో వెలుగు చూసింది. అడ్డాకుల ఎస్సై మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం... 
 
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం నర్సప్పగూడకు చెందిన రండంపల్లి రామస్వామి కొంతకాలంగా షాద్‌నగర్‌లో తన కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. రామస్వామికి యాదగిరి(35), శ్రీనివాసులు అనే ఇద్దరు కొడుకులు, కుమార్తె మాధవి ఉన్నారు. కొడుకులిద్దరూ ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. 
 
అయితే, పెద్దకొడుకు యాదగిరి మద్యానికి బానిసై రోజూ ఇంట్లో గొడవ చేస్తూవచ్చేవాడు. దీంతో అతని భార్య జ్యోతి మూడేళ్ల పాపతో రెండేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రి రామస్వామి ఉంటున్న ఇంటిని తన పేరున రాయాలంటూ యాదగిరి కొంతకాలంగా వేధించసాగాడు. కుమార్తె పెళ్లి జరిగేవరకు ఇల్లు ఎవరికీ ఇవ్వనని తండ్రి తెగేసి చెప్పాడు. 
 
ఈ క్రమంలో బుధవారం ఉదయం యాదగిరి మళ్లీ గొడవపడి తండ్రిని చితకబాదాడు. ఈ విషయం సాయంత్రం ఇంటికొచ్చిన చిన్నకుమారుడు శ్రీనివాసులుకు తెలిసింది. ఇంట్లో గొడవలకు కారణమవుతున్న యాదగిరిని హతమార్చాలని రామస్వామి, శ్రీనివాసులు నిర్ణయించుకున్నారు. వారు అనుకున్నదే తడవుగా ఉద్దేశ్యపూర్వకంగా యాదగిరితో గొడవకు దిగారు. ఇదే అదునుగా భావించిన రామస్వామి కుమారుడు యాదగిరి తలపై కర్రతో బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. ఆ తర్వాత కొట్టగా శ్రీనివాసులు వెంటనే అన్నపై పెట్రోలు పోయగా.. రామస్వామి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న యాదగిరి బాధతో తండ్రిని, తమ్ముణ్ని పట్టుకోబోయి అక్కడే కుప్పకూలిపోయాడు. 
 
ఆ సమయంలో రామస్వామికి కాలిన గాయాలయ్యాయి. అనంతరం మృతదేహాన్ని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో పడేసేందుకు శ్రీనివాసులు నడిపే టాటాఏస్‌లో బయల్దేరారు. అయితే, గురువారం తెల్లవారుజామున కందూరు బ్యాంకు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అడ్డాకుల పోలీసులు వీరిని ఆపి, వాహనాన్ని తనిఖీ చేయగా శవం కనిపించటంతో శ్రీనివాసులు, రామస్వామిలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.