1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (08:09 IST)

చెత్తలో శవాలా? కోవిడ్ మృతదేహాలు పశువుల కంటే హీనమా?

ఢిల్లీలోని కోవిడ్ ఆస్పత్రుల్లో మృతదేహాల నిర్వహణ అధ్వాన్నంగా ఉందనీ, స్పష్టంగా చెప్పాలంటే అత్యంత భయానంకంగా ఉందనీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వైరస్‌తో చనిపోయిన రోగి మృతదేహాన్ని చెత్తలోనూ, ఆస్పత్రుల్లోని కారిడార్లలో పడేస్తారా అంటూ ప్రశ్నించింది. 
 
కొవిడ్‌ మృతదేహాల అంతిమ సంస్కారంలో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఢిల్లీ హైకోర్టులో కోర్టుధిక్కార పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
ఆసుపత్రులు మృతదేహాల నిర్వహణ పట్ల శ్రద్ధ వహించడం లేదని, కనీసం మరణాల విషయాన్ని బంధువులకు సమాచారం ఇవ్వడం లేదని ధర్మాసనం మండిపడింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరు కాలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించింది.
 
కొవిడ్‌తో మరణించిన వారి మృతదేహాలను రోగుల బెడ్ల పక్కనే ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌ రోగులను పశువుల కన్నా హీనంగా చూస్తున్నారని, ఒక మృతదేహం ఆసుపత్రి చెత్త కుప్పలో కనిపించిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. 
 
మృతదేహాలకు కనీస గౌరవంతో అంతిమ సంస్కారాలు జరగాలని అభిప్రాయపడింది. ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స, మృతదేహాల నిర్వహణ తీరుపై మీడియాలో వచ్చిన కథనాలు, కేంద్ర మాజీ న్యాయమంత్రి అశ్వినీ కుమార్‌ రాసిన లేఖను ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు తనకు తానుగా విచారణ చేపట్టింది. కేంద్రాన్ని, మహారాష్ట్ర, బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలను వివరణ ఇవ్వాలని ఆదేశించింది.