ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (08:47 IST)

పండగపూటే పరలోకానికి పంపిన కసాయి... భార్యను గొంతునులిమి హత్య చేసిన భర్త

ఓ కసాయి భర్త పండగ పూటే పరలోకానికి పంపించాడు. భార్యపై ఉన్న అనుమానంతో గొంతునులిమి హత్య చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని తలకొండపల్లికి చెందిన రాము (30) అనే వ్యక్తికి సరూర్ నగర్ డివిజన్‌లోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన శ్వేత (26) అనే మహిళతో ఎనిమిదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ బాబు ఉన్నాడు. 
 
మద్యానికి బానిసగా మారిన రాము.. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో భర్త వేధింపులు భరించలేని ఆమె రెండేళ్ల క్రితం సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. 
 
అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా ఇటీవల భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. సంక్రాంతి పండుగ రోజున రాత్రి ఫుల్లుగా తాగొచ్చిన రాము భార్య గొంతు నులిమి హత్య చేసి, ఇంట్లో ఉన్న రూ.15 వేలను పట్టుకుని పరారయ్యాడు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉన్నా అలికిడి లేకపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా శ్వేత మృతి చెంది కనిపించింది. ఆమె తండ్రి నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.