శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:34 IST)

ఐమాక్స్ మిర్రర్ మేజ్‌లో బాలికల పట్ల ఉద్యోగి అసభ్య ప్రవర్తన... మూడేళ్ల జైలు

హైదరాబాద్‌ నగరంలో ఐమాక్స్‌లో థియేటర్‌లో మిర్రర్ మేజ్ హౌస్‌లో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో ఓ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు.. రూ.వెయ్యి అపరాధం విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన రెండు కుటుంబాల సభ్యులు రెండేళ్ళ క్రితం ఐమాక్స్ థియేటర్‌కు సినిమా చేసేందుకు వెళ్లారు. వీరిలో ఇద్దరు బాలికలూ  కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ మిర్రర్ మేజ్‌ హౌస్‌ను చూసేందుకు లోపలికి వెళ్లారు. 
 
ఈ హౌస్‌లో బయటి వెలుగుతో పోలిస్తే, చాలా తక్కువ కాంతి ఉంటుంది. చుట్టూ ఉండే అద్దాలు ఎంతో అయోమయానికి గురిచేస్తాయి. దీన్నుంచి బయటకు రావడం అంత సులువు కాదు. లోపలికి వెళ్లే వారికి సహాయం చేసేందుకు కొందరు ఉద్యోగులు కూడా ఉంటారు. వారి సూచనల మేరకు చేతులతో తడుముకుంటూ, అద్దాల మార్గంగుండా బయటకు రావాల్సి వుంటుంది.
 
ఈ క్రమంలో ఆ ఇద్దరు బాలికలపై అద్దాల హౌస్‌లో పని చేస్తున్న రతన్ ఆనంద్ (24) అనే యువకుడు వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆపై బయటకు వచ్చిన వారు, తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసును విచారించిన మొదటి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి‌కే సునీత, రతన్ ఆనంద్‌ను దోషిగా తేల్చి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు.