శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (08:58 IST)

బర్త్‌డే పార్టీకి పిలిచి.. మద్యం తాగించి... ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. పుట్టినరోజు పార్టీకి కల్లిబొల్లి మాటలతో ఆహ్వానించి ఆ తర్వాత మద్యంతాగించి 9 మంది కామాంధులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. వీరిలో ఓ మాజీ సైనికోద్యోగి, సహచర విద్యార్థి కూడా ఉండటం విచారకరం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గిద్దలూరు పట్టణానికి చెందిన 17 యేళ్ళ బాలిక స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఆమెకున్న మానసిక సమస్యను మిలటరీ మాజీ ఉద్యోగి సురేంద్ర (45) తనకు అనుకూలంగా మలచుకున్నాడు. మాయమాటలతో ఆమెకు మద్యం అలవాటు చేశాడు. తన పుట్టినరోజు వేడుకలకు రావాలని ఆహ్వానించాడు. దీంతో అతని మాటలు నమ్మిన ఆ యువతి అతని ఇంటికి వచ్చింది. ఈ పార్టీలో ఆమెకు పూటుగా మద్యం తాగించాడు. 
 
దీంతో ఆ యువతి మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన సురేంద్రతో పాటు.. అతని స్నేహితులు 8 మంది కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఆ యువతి మౌనంగా ఉండటం, ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించి తల్లిదండ్రులు నిలదీయగా, అసలు విషయం చెప్పి బోరున విలపించింది. దీంతో గిద్దలూరు పట్టణ సీఐ శ్రీరాంను కలిసి ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఇదిలాఉండగా, బాధితురాలి మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుసుకున్న మరికొందరు కూడా ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నట్టు తెలిసింది. కాగా, నిందితుల్లో ఆమె సహచర విద్యార్థి ఒకరు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.