గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (21:10 IST)

నీ కొడుక్కి బుర్ర పనిచేయదు... కుక్కలు, పందులతో కలిసి తిరుగుతావా? మంత్రి కొడాలి ఫైర్

నవ్యాంధ్ర మంత్రి కొడాలి నాని మరోమారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకున్నారు. మొన్నటికిమొన్న వాడు, గీడు, లుచ్ఛా అంటూ వ్యాఖ్యానించిన కొడాలి నాని... ఇపుడు మరోమారు అంటువంటి పదజాలాన్నే వాడారు. ఇపుడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. 
 
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతం అమరావతిలో పర్యటించాలని నిర్ణయం తీసుకోవడంపై మంత్రి కొడాలి నాని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, ఎల్లుండి చంద్రబాబు కూడా వాటితో పాటే రాజధానిలో తిరుగుతారా అంటూ ప్రశ్నించారు. 
 
పైగా, చంద్రబాబు ఉండేది రాజధానిలోనే కదా, మరి ఎక్కడినుంచో చంద్రమండలం నుంచి వచ్చినట్టు అమరావతిలో పర్యటిస్తానని సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రాజధానిలో నాలుగు భవనాలు, తుప్పలు, ముళ్లపొదలు తప్ప మరేమీ లేదని అన్నారు. చంద్రబాబునాయుడ్ని నేలకేసి కొట్టి 23 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదంటూ మండిపడ్డారు. 
 
చంద్రబాబునాయుడు ఓ సన్నాసి అని, ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు అమరావతిపై సమీక్షలు, గ్రాఫిక్స్ రిలీజ్ చేయడం, మధ్యాహ్నం నుంచి పోలవరంపై సమీక్షలు, ఒక్క శాతమో, పావు శాతమో పని జరిగిందని చెప్పడం ఇలా ఆ రెండు అంశాలు తప్ప ఇంకేమీ పట్టించుకోలేదన్నారు.
 
'ఐదు, పదివేలకు, రెండు పలావు పొట్లాలకు, పాతిక లీటర్ల డీజిల్‌కు పనిచేసేవాళ్లు కాకుండా కాస్త బుర్ర పనిచేసేవాళ్లను పనిలో పెట్టుకుని ఓటమిపై రివ్యూ చేసుకోవాలి. నీకు, నీ కొడుక్కి బుర్ర పనిచేయదు కాబట్టి బుర్ర ఉన్న నలుగుర్ని ఏరుకుని సమీక్ష చేసుకోండి. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి, పోలవరం... ఓడిపోయి విపక్షంలో ఉన్నప్పుడు కూడా అమరావతి, పోలవరమేనా అంటూ దుయ్యబట్టారు. 
 
మాకు పోలవరం, అమరావతి మాత్రమే కాదు 13 జిల్లాలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఆ దిశగానే జగన్ పాలన సాగుతుందన్నారు. జగన్ సీఎం పీఠం ఎక్కి ఆర్నెల్లు కూడా కాలేదు. అప్పుడే ఆయనపై బురదజల్లడం తగదన్నారు. మేం ఏదన్నా అంటే బూతులు తిడుతున్నారంటూ చంద్రబాబు ఏడుస్తున్నారు. ఆర్నెల్లో కనీసం ఓ ఇల్లు కూడా కట్టలేదని అంగీకరించారు. 
 
పైగా, పక్కా భవనాలు నిర్మించాలంటే జగన్‌కు కాస్త టైము ఇవ్వాలి. అలాకాకుండా, జగన్ నువ్వో సైకో, జగన్ నువ్వో దుర్మార్గుడివి, బాబాయిని చంపావు అంటూ ఆరోపణలు తప్ప వైఎస్సార్ సమకాలికుడవని చెప్పుకునే నువ్వు ఏనాడైనా సానుకూల ధోరణితో సలహాలు ఇచ్చావా! అంటూ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు.