1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 1 జూన్ 2020 (20:36 IST)

ద్యావుడా, కరోనాను మించిన అపాయం చిత్తూరు జిల్లాకు వచ్చింది, ఏంటది?

మిడతలు జనానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మిడతలు రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. నిన్నటికి నిన్న అనంతపురం జిల్లాలోకి మిడతలు వస్తే ఈ రోజు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. ఒకవైపు కరోనా దెబ్బతో జనం భయపడిపోతుంటే ఇప్పుడు లక్షలాది మిడతలు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతానికి ఈ గుంపు చేరుకుంది.
 
ముఖ్యంగా కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్రం వేపనపల్లి వద్ద ఇవి స్థావరాలను ఏర్పాటు చేసేసుకున్నాయట. దీంతో రైతులు, ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మిడతలు కొన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ పంటలను తీవ్రంగా నష్టపరిచాయి.
 
మిడతల నుంచి కాపాడుకునేందుకు రైతులు రకరకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. రసాయనాలతో పిచికారీ చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతోంది. లక్షలాది మిడతలను అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యం కావడం లేదు. మొన్న కర్ణాటక, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో మిడతలు స్వైర విహారం చేయడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.