గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (08:23 IST)

బతుకులు మార్చే గుడి జగనన్న అమ్మఒడి: మంత్రి శ్రీరంగనాధ

పుట్టిన ప్రతి బిడ్డ చదువుకుని అభివృద్ధిలోకి రావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చేరుకువాడ శ్రీరంగనాధ చెప్పారు. పెనుమంట్ర మండలం మార్టేరులోని శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అమ్మఒడి పథకాన్ని మంత్రి శ్రీరంగనాథ రాజు ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ బతుకులు మార్చే గుడి జగనన్న అమ్మఒడి అని అన్నారు. పేదరికం చదువులకు ఆటంకం కాకూడదనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. పేదల చదువుల కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అందుకోసం బడ్జెట్లో రూ.6456లు కేటాయించడం జరిగిందని చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం అమలు వల్ల పిల్లలు చదువుకుని ఆయా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించగలదని మంత్రి చెప్పారు.

ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రజాసంకల్పయాత్ర పూర్తయి నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. తల్లులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను బాగా చదివించాలని, చదువు వల్లనే విద్యార్థులు అభివృద్ధి లోకి వస్తారని, తద్వారా కుటుంబం గ్రామం దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి చెప్పారు.

నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు . ఆంగ్ల విద్య బోధన ద్వారా పేద విద్యార్థులు కూడా బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి ఉన్నత ఉద్యోగాలు సాధించాలనే సంకల్పం తో పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు. 

జిల్లా విద్య శాఖ అధికారి సివి రేణుక మాట్లాడుతూ చదువుకుంటేనే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుంటాయని కాబట్టి ప్రతి తల్లి తన పిల్లలను పనికి తప్పకుండా బడికి పంపాలన్నారు. గతంలో చదువుకోవాలనే ఉద్దేశ్యమ్, ఉత్సాహం ఉన్నప్పటికీ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకునే వారని, కానీ ప్రస్తుతం రోజులు మారాయ‌న్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నాడు నేడు కార్యక్రమం ద్వారా వచ్చే మూడేళ్లలో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపిస్తే చాలు వారి చదువు బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటూ మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దుతుందని చెప్పారు.

విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న మెనూ మార్చి సంక్రాంతి సెలవులు అనంతరం తిరిగి పాఠశాలలు తెరిచే సమయానికి కొత్త మెనూ. ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు ఆహారం అందించడం జరుగుతుందని చెప్పారు.

ప్రతి రోజు ఒకే రకమైన ఆహారం అందిస్తుంటే కొంతమంది విద్యార్థులు సరిగ్గా భోజనం చేయడం లేదనే ఉద్దేశంతో కొత్త మెనూను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు . ఆరోగ్యంగా, మానసిక ఉల్లాసంగా ఉన్నప్పుడే ఎలాంటి విద్యార్థి ఐనా చదువులో రాణిస్తారని. డిఈఓ రేణుక చెప్పారు.

తణుకు ఉప విద్యాశాఖాధికారి వివిఎస్ఎస్ వరదాచార్యులు, పెనుమంట్ర ఎంపీడీవో ఆర్.విజయరాజు, పెనుమంట్ర తాసిల్దార్ ఎం.సుందరరాజు, పెనుమంట్ర మండల విద్యా శాఖ అధికారి శారదా జోష్న, వైయస్సార్ సిపి మండల అధ్యక్షుడు కర్రీ వేణుబాబు, ఆచంట మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శంకర సీతారాం, ఎస్.వి.జి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శివజ్యోతి, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.