శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (09:37 IST)

ప్రియుడు గొంతు నులిమితే... భార్య ఎదురొమ్ముపై గుద్ది భర్తను చంపేసింది...

తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. భర్త గొంతును ప్రియుడు నులిమితే.. భర్త ఎదురొమ్ముపై భార్య దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లి ఓ కాలువలో పడేశారు. ఈ దారుణం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సమీపంలోని హలియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనిపల్లి గ్రామానికి చెందిన దార శ్రీనయ్య, భార్య వాణితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల కిత్రం హాలియాకు వచ్చాడు. హాలియాలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో అదే ఇంట్లో పక్క పోర్షన్‌లో నివశించే మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన బచ్చు వెంకట్‌ రెడ్డితో వాణికి పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికిదారితీసింది. 
 
ఈ క్రమంలో శ్రీనయ్య పనికి వెళితే... వాణి, వెంకట్ రెడ్డిలు కలిసి ఇంట్లో శారీరకంగా కలుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన శ్రీనయ్య.. భార్య వాణిని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాకపోగా, భర్తనే హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని ప్రియుడుకు చెప్పగా అతను కూడా సమ్మతించాడు. 
 
ఈ క్రమంలో గత మార్చి 17వ తేదీన భార్య వాణి, వెంకట్‌ రెడ్డి, వినోద్‌ రెడ్డి, మహేష్‌ కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనయ్యను గొంతు నులిమి, ఎదురొమ్ముపై బాగా కొట్టారు. బలమైన దెబ్బలకు శ్రీనయ్య స్పృహ కొల్పోయాడు. నిందితులు శ్రీనయ్యను ఓ మోటార్‌బైక్‌పై కూర్చొబెట్టుకుని హాలియా సమీపంలో ఉన్న ఎడమకాల్వలో పడేశారు. 
 
నీటి కాలువలో ఓ వ్యక్తి చనిపోయాడని సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో మృతుడు శ్రీనయ్యగా గుర్తించారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా, పక్క పోర్షన్‌లోని వెంకట్ రెడ్డిని సందేహించిన పోలీసులు... అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో నిజాలు వెల్లడయ్యాయి. దీంతో వెంకట్ రెడ్డితో పాటు శ్రీనయ్య భార్య వాణి, వినోద్ రెడ్డిలను అరెస్టు చేశారు.