1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 30 మే 2018 (18:07 IST)

పురుషులను కూడా చంపేస్తున్నారు కొందరు మహిళలు... కమిషన్ వేయాల్సిందే... నన్నపనేని

అమరావతి : రాష్ట్రంలో మహిళా కమిషన్ మాదిరిగా పురుషుల కమిషన్ వేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎంచంద్రబాబునాయుడిని కలిసి కోరనున్నట్లు ఆమె వెల్లడించారు. పోర్న్ సైట్లతో పాటు భయానక దృశ్యాలతో కూడిన టీవీ సీరియళ్ల

అమరావతి : రాష్ట్రంలో మహిళా కమిషన్ మాదిరిగా పురుషుల కమిషన్ వేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎంచంద్రబాబునాయుడిని కలిసి కోరనున్నట్లు ఆమె వెల్లడించారు. పోర్న్ సైట్లతో పాటు భయానక దృశ్యాలతో కూడిన టీవీ సీరియళ్లను నిషేధించాలన్నారు. అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నిందితులపై కఠిన శిక్షలు వేయాలన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 
 
రాష్ట్రంతో పాటు దేశంలోనూ పసిపిల్లలు, మహిళలపై అత్యాచార ఘటనలు చోటుచేసుకోవడం బాధాకర విషయమన్నారు. అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠినమైన శిక్షలు వేయాలన్నారు. నిందితులను గ్రామాల నుంచి బహిష్కరించాలన్నారు. ముసుగులు వేయకుండా వీధుల్లో సంకెళ్లతో నడిపించాలన్నారు. అత్యాచారానికి పాల్పడాలంటే హడలిపోయేలా గుణపాఠం చెప్పాలన్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అయ్యన్నపాలెంలో ఒక యువతి అత్యాచారానికి గురైందన్నారు. బాధితురాలు అన్నం తినడానికి కూడా భయపడిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార నిందితుడిపై దాడి ఎందుకు చేయలేదని గ్రామస్తులను నిలదీసినట్లు ఆమె తెలిపారు. 
 
నిందితుడిని గ్రామం నుంచి బహిష్కరించాలని తెలిపానన్నారు. బుధవారం గుంటూరు జిల్లా కంతేరు గ్రామంలో ప్రతిరోజూ తాగొచ్చి హింసిస్తున్న భర్తను చంపిన భార్య తీరును తాను సమర్థిస్తున్నట్లు మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి వెల్లడించారు. మాన, ప్రాణ రక్షణ కోసం పోలీసులు వచ్చేవరకూ కాకుండా తనను తాను రక్షించుకోవడం కోసం బాధితులు నిందితులపై తిరగబడాలన్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో కడుపున పుట్టిన పిల్లలను, భర్తలను చంపడం ఇటీవల ఎక్కువైందని ఆమె ఆందోళన వెలిబుచ్చారు. 
 
విజయనగరం జిల్లాలో పెళ్లయిన వారం రోజుల్లో వధువు చేతిలో వరుడు హతమయ్యాడన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మరో యువతి తన భర్త గొంతును ద్విచక్ర వాహనంపై వెలుతుండగా కోసేసిందన్నారు. బాధితుడు శ్రీకాకుళం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ఈ ఇద్దరు యువతుల తీరును ఆమె తప్పుబట్టారు. తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు. 3, 4 తేదీల్లో బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇవ్వనున్నట్లు మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. పలు టీవీ చానళ్లలో వస్తున్న సీరియళ్లు భయానంగా ఉంటున్నాయన్నారు. వాటిని చూసి మహిళలు, చిన్నారులు ప్రభావితమయ్యే ప్రమాదముందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే పీఎం నరేంద్రమోడికి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి టీవీ సీరియళ్లపై సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఇప్పటివరకూ రెండు పర్యాయాలు లేఖలు రాశానన్నారు. 
 
సినిమాలకి మాత్రమే సెన్సార్ బోర్డు ఉందని, టీవీలకు లేదని పీఎంవో నుంచి లేఖ వచ్చిందని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. ఇది సరికాదన్నారు. మరోసారి టీవీ సీరియళ్లపై సెన్సార్ బోర్డు ఏర్పాటుకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీనిపై త్వరలో సీఎం చంద్రబాబునాయుడును కలిసి విన్నవించనున్నట్లు ఆమె తెలిపారు. అత్యాచారాలు ఘటనలు పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని, శాంతిభద్రతల సమస్యకాదని, ఇటువంటివి ఎవరూ ఊహించని సంఘటనలు అని ఆమె అన్నారు. 
 
అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలు కఠినంగా ఉండాలన్నారు. ఇటీవల గుడిపాడు గ్రామం నుంచి గల్ఫ్‌కు మహిళలు తరలిస్తున్నారనే సమాచారం వచ్చిందన్నారు. వెంటనే ఆ గ్రామానికి వెళ్లానని, గల్ఫ్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వివాహితను అడ్డుకున్నామని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. ఇద్దరు భార్యాభర్తలకూ ఉపాధి కల్పించామని, ఆమె పిల్లలను స్కూల్లో చేర్పించామన్నారు. ఇలా మొత్తం కుటుంబాన్ని గాడిలో పెట్టామన్నారు.