శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (18:36 IST)

గెలుపోటములు సహజమే... ప్రజల కోసం పని చేస్తాం : నారా లోకేశ్

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తాను పోటీ చేసిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో పాటు.. రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"టీడీపీ శాసనసభ అభ్యర్థిగా నేను పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కావు. ఇకముందు కూడా ప్రజల్లో ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను" అని చెప్పారు. 
 
"గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీకి, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే, సీసీ రోడ్ల నిర్మాణంపై ఓ మహిళ చేసిన ట్వీట్‌కు నారా లోకేశ్ స్పందించారు. "మీ స్పందనకు కృతజ్ఞతలు. మీ గ్రామానికి వేసినట్టుగానే గత ఐదేళ్ళలో ఏపీలో ఏకంగా 25,194 కిలోమీటర్ల మేర కొత్త సీసీ రోడ్లను బాధ్యతగా నిర్మించాం. ఇలాగే ఆయా గ్రామాల ప్రజల కలలు నెరవేర్చాం. ఇది మాకెంతో తృప్తినిచ్చిన అంశం" అని లోకేశ్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.