శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (12:00 IST)

నాయుడూజీ ఎలా ఉన్నారంటూ ఆరంభం - అన్నీ సవ్యంగానే జరుగుతాయంటూ ముగింపు : బాబుకు మోడీ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు వైదొలిగిన విషయం తెల్సిందే. వీరిద్దరు రాజీనామా పత్రాలను సమర్పించక

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు వైదొలిగిన విషయం తెల్సిందే. వీరిద్దరు రాజీనామా పత్రాలను సమర్పించక ముందే చంద్రబాబుకు మోడీ ఫోన్ చేసి, రాజీనామాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం మోడీనే స్వయంగా బాబుకు ఫోన్ చేసి సుమారు 10 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్టు సమాచారం. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రధాని మోడీ : నాయుడూజీ ఎలా ఉన్నారు?
సీఎం చంద్రబాబు : బాగున్నాను సర్‌.
 
ప్రధాని : బుధవారం రాత్రి నాకు బాగా ఆలస్యమైంది. అందుకే మీ ఫోన్‌కు ప్రతిస్పందించలేకపోయాను. గురువారం ఉదయమే రాజస్థాన్‌ వెళ్లడంతో మాట్లాడటం కుదరలేదు!
సీఎం: ఓకే సర్‌.
 
ప్రధాని: మా మంత్రివర్గం నుంచి వైదొలగాలని మీరు తీసుకొన్న నిర్ణయం చూశాను. ఎందుకు తొందరపడుతున్నారు? మనం కూర్చుని మాట్లాడుకొందాం. సమస్యలు ఉంటానే ఉంటాయి. ఎన్ని వీలైతే అన్ని పరిష్కరించుకొందాం. మీరు ఢిల్లీ రండి!
సీఎం: దానికి సమయం మించిపోయింది. మేం నాలుగేళ్లుగా ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మిమ్మల్ని కూడా అనేకసార్లు కలిశాం. ఓపికగా ఎదురు చూశాం. ఆఖరి బడ్జెట్‌ వరకూ కూడా సహనంతోనే ఉన్నాం. కానీ, మీ ప్రతిస్పందన మాకు నిరాశ కలిగించింది. ప్రజల్లో కూడా ఇది భావోద్వేగానికి దారితీసింది. తప్పని పరిస్ధితుల్లో మా అసంతృప్తి వ్యక్తం చేయడానికి రాజీనామాల నిర్ణయం తీసుకొన్నాం. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు. మొత్తం ఎంపీలు, మా పార్టీ నేతలు, రాష్ట్ర ప్రజలందరి సమష్టి నిర్ణయం. అన్నీ ఆలోచించే తీసుకొన్నాం. మర్యాదపూర్వకంగా మీకు తెలియచేశాకే ప్రకటించాలనుకొన్నాం. మీరు అందుబాటులోకి రానందుకే ప్రకటించేశాం!
 
ప్రధాని: కొన్ని పరిష్కారం అయినట్లుగా నాకు అధికారులు సమాచారం అందించారు కదా!
సీఎం: ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని గతంలో మాకు చెప్పారు. కానీ, ఆ ప్రయోజనాలు ఇటీవల కొన్ని రాష్ట్రాలకు పొడిగించారు. దానిని మాకూ వర్తింప చేయాలని కోరాం. కుదరదని చెప్పారు. పారిశ్రామిక రాయితీలు హోదా ఉన్న రాష్ట్రాలకు పొడిగించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీ ప్రకారం మాకూ ఇవ్వాలన్నాం. ఇవ్వలేమని చెప్పారు. హోదా బదులు రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఈ రోజు వరకూ మాకు పైసా అందలేదు. లోటు భర్తీ కింద చాలా రావాలి. కొద్దిగా తేల్చి అదే ఇస్తామంటున్నారు. రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఓడ రేవు... ఇలా ఏదీ తేల్చలేదు. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో మాకు పోటీ పెడుతున్నారు. పార్లమెంటులో విభజన చట్టం మిగిలిన రాష్ట్రాలకు తేలేదు కదా? ఇచ్చిన హామీల అమలు గురించే మేం అడుగుతున్నాం. వేరేవి అడగడం లేదు!
 
ప్రధాని: మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. కూర్చుని మాట్లాడుకుంటే ఫలితం వస్తుందన్నది నా విశ్వాసం. అందుకే, మరోసారి రమ్మంటున్నాను.
సీఎం: చర్చలకు మేం వ్యతిరేకం కాదు. మా సమస్యలు పరిష్కరిస్తామంటే ఎందుకు వద్దంటాం? మేం మంత్రి పదవుల నుంచి మాత్రమే వైదొలిగాం. ఎన్డీయే కూటమి నుంచి తప్పుకోలేదు. మిత్రపక్షంగానే ఉన్నాం. ఇప్పటికైనా మీరు చేయండి. మీ మేలు మర్చిపోలేం!
 
ప్రధాని: అన్నీ సవ్యంగా జరుగుతాయని అనుకుంటున్నాను! అంటూ ఫోన్ కట్ చేశారు.