గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (07:44 IST)

అవిశ్వాసంపై చర్చ ఖాయమా? టీఆర్ఎస్ ఏమంది? ఎంపీలు రాజీనామా చేస్తారా?

అవిశ్వాసంపై పార్లమెంట్‌లో చర్చ జరిగేలా సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీల నిరసనలు, వైకాపా, టీడీపీ పార్టీల అవిశ్వాస నోటీసులు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే అవిశ్వా

అవిశ్వాసంపై పార్లమెంట్‌లో చర్చ జరిగేలా సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీల నిరసనలు, వైకాపా, టీడీపీ పార్టీల అవిశ్వాస నోటీసులు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే అవిశ్వాసంపై చర్చ జరగకుండా బీజేపీ సర్కారు వాయిదాల పర్వం కొనసాగిస్తుంది. 
 
ఇంకా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టి నినాదాలు చేయిస్తూ.. అవిశ్వాసంపై చర్చ జరగకుండా వ్యూహం వేసిందని బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ అవిశ్వాసంపై చర్చకు సిద్ధమవుతోంది. మరోవైపు అవిశ్వాసంపై మంగళవారం చర్చ జరగని పక్షంలో తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని వైకాపా చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
ఇదిలా ఉంటే.. కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు తమ వల్ల ఆటంకం కలిగే పరిస్థితి రానివ్వమని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం నిమిత్తం తమ పార్టీ ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలని కోరడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నామన్నారు. 
 
వారం రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం ప్రభుత్వంలో కదలిక లేదని విమర్శించారు. తాము చేస్తున్న ఆందోళనను సాకుగా తీసుకుని, లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ వాయిదా వేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అవిశ్వాసంపై చర్చ జరిగితే తమ డిమాండ్లను ప్రస్తావించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు అన్నాడీఎంకే ఎంపీలకు ఎన్డీయే సర్కారు నచ్చజెప్పి.. అవిశ్వాసంపై చర్చ జరిగే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో మంగళవారం అవిశ్వాసంపై చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.