శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (10:27 IST)

మోడీ సర్కారుకు ఆపద్బాంధవుల్లా తెరాస ఎంపీలు.. అవిశ్వాసం లేకుండా అడ్డుపుల్ల

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెరాస ఎంపీలు ఆపద్బాంధవుల్లా వ్యవహరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై అధికార తెలుగుదేశం, వైకాపా పార్టీలు ఇచ్చే అవిశ్వాస

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెరాస ఎంపీలు ఆపద్బాంధవుల్లా వ్యవహరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై అధికార తెలుగుదేశం, వైకాపా పార్టీలు ఇచ్చే అవిశ్వాస తీర్మాన నోటీసు చర్చకు రాకుండా తెరాస ఎంపీలు మోకాలొడ్డుతున్నారు. గత శుక్రవారం నుంచి ఇదేతంతు జరుగుతోంది. ఏపీలో పెళ్లంటే మా తెలంగాణలో రంగులెందుకు వేసుకుంటామని తెరాస ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా తెరాస అధినేత కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ హంగామా చేస్తున్నారు. ఇదే అంశంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సైతం కలిశారు. మరో కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా కేసీఆర్ పార్టీకి చెందిన ఎంపీలు తమవంతు సహకారం అందిస్తున్నారు. 
 
ఛైర్లో స్పీకర్ కూర్చోక ముందే వెల్‌లోకి వెళ్లి టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో, సభ ఆర్డర్‌లో లేదని... అవిశ్వాసంపై చర్చను చేపట్టలేమని... సభను వాయిదా వేస్తున్నామని స్పీకర్ ప్రకటించడం ఆనవాయతీగా మారింది. అవిశ్వాసంపై చర్చ జరిగేలా సహకరించాలని తెరాస ఎంపీలను టీడీపీ, వైసీపీ ఎంపీలు బ్రతిమిలాడినా... వారు తమ సొంత వైఖరిని కొనసాగిస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో, బుధవారం కూడా పార్లమెంటులో తమ ఆందోళనలను కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. వివిధ అంశాలపై తమ ఆందోళనలు కొనసాగుతాయని, తమ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలు కొనసాగితే బుధవారం కూడా సభ వాయిదాపడే అవకాశం ఉంది.