శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 20 మార్చి 2018 (09:59 IST)

అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే మోడీ సర్కారుకు ముప్పు: బీజేపీ ఎంపీలు?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చంటూ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు తగిన గుణపాఠం చెప్పాలన్న ధోరణిలో కమలం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చంటూ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు తగిన గుణపాఠం చెప్పాలన్న ధోరణిలో కమలం పార్టీ ఎంపీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై వారు తమతమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకోవడం గమనార్హం. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో అవిశ్వాస పరీక్షకు అంగీకరించడమో లేదా విశ్వాస పరీక్షను ఎదుర్కోవడమో చేయాలనే హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూచించారు. దీనికి ప్రధాని మోడీ, అమిత్‌ షా అంగీకరించలేదు. చర్చంటూ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి పలు అంశాలు బయటకు వస్తాయని, అది కర్ణాటక ఎన్నికల్లో తమకు నష్టం చేకూరుస్తుందని వారు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. 
 
అదేసమయంలో బీజేపీలో అంతర్గతంగా లుకలుకలు చెలరేగినట్లు సమాచారం. ముఖ్యంగా, ఇటీవల త్రిపురలో బీజేపీ అగ్రనేత అద్వానీని ప్రధాని నరేంద్ర మోడీ అవమానించిన తీరు చాలా మంది పార్టీ ఎంపీల మనసు గాయపరిచింది. పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు పూర్తి సంఖ్యలో ఎంపీలు రాకపోవడం.. విప్‌ జారీ చేసినా ఉభయసభల్లో ట్రెజరీ బెంచీలు ఖాళీగా కనపడటం పార్టీ అగ్ర నేతలను కలవరపరుస్తోంది.
 
దీంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగితే కమలదళం సభ్యులే ఎంతమంది హాజరవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. 
 
ఒకవేళ అవిశ్వాస తీర్మానంపై చర్చంటూ జరిగితే ఎన్డీయే మిత్రపక్షాల సంగతి అటుంచితే... బీజేపీ ఎంపీల్లోనే ఎంతమంది ఓటింగ్‌కు హాజరవుతారన్న భయం పార్టీ పెద్దల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా వైఖరి నచ్చని అనేక మంది సభ్యులు గైర్హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందకే అవిశ్వాస పరీక్షను ఎదుర్కోకుండా ఏకంగా సభనే నిరవధికంగా వాయిదా వేయించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.