శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (07:46 IST)

అర్జీలపై ఉత్తర ప్రత్యుత్తరాలు ఇక తెలుగులో... డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

తెలుగు భాషపై వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి అమితమైన ప్రేమ ఉందని  డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. అందుకే తాను భాషా సంఘం ద్వారా నిర్దిష్ట లక్ష్యాల సాధనకు పని మొదలుపెడుతున్నానని చెప్పారు. అమరావతి సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి  పేషీలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రమాణం స్వీకారోత్సవం జరిగింది.

పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు యార్లగడ్డను మేళతాళాలతో తన ఛాంబర్లోకి తోడ్కొని వెళ్ళారు. ఆయనతోపాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని వెంకట్రామయ్య,  కొడాలి వెంకటేశ్వరరావు,  టూరిజం కార్యదర్శి ప్రవీణ్ కుమార్, భూమన కరుణాకర్ రెడ్డి, ఎపిటిడిసి ఎండి ప్రవీణ్ కుమార్ డాక్టర్ యార్లగడ్డను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రభుత్వ పరిపాలనలో తెలుగు భాష అమలు పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం అని తెలిపారు. మంత్రుల పేషీలలో,  ఉన్నతాధికారులకు  వచ్చే అర్జీలకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు అన్ని తెలుగులోనే జరిగేలా సాఫ్ట్ వేర్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

 న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కూడా తెలుగులోనే ఉండేలా అధికార భాషా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో లబ్దప్రతిష్టులైన  30 మంది మహానుభావులకు స్మృతి మందిరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, ఆరుద్ర శ్రీశ్రీ వంటి తెలుగు సాహితీ వేత్తల స్వగృహా లను భావితరాల వారికి స్మృతి చిహ్నంగా అందించాల్సిన అవసరం ఉందని లక్ష్మీ ప్రసాద్ వివరించారు.

 తెలుగు విశ్వవిద్యాలయాల్లో సరికొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. హిందీని మనపై రుద్దుతున్నారనడం సరికాదని, తిలకం, గంధం దిద్దినట్లు హిందీ ఆభుషణం కావాలన్నారు.

యార్లగడ్డ ను సన్మానించిన అనంతరం పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ,  తెలుగు భాష పై యార్లగడ్డ కు మక్కువ ఎక్కువ అని,  మన సంస్కృతి సంప్రదాయాలకు ఆయన ఇచ్చే విలువను గుర్తించి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఉచితాసనం వేశారని కొనియాడారు. 

సరైన స్థానంలో సరైన వ్యక్తి ని సీఎం నియమించారని మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి నాని యార్లగడ్డను అభినందించారు.