శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (12:59 IST)

ముద్దులు పెట్టడానికి రాలేదు - వారిద్దరూ అన్న - పెదనాన్నలు కాదు : పవన్ కళ్యాణ్

తాను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలా ముద్దులు పెట్టడానికి రాలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ, 'జగన్‌లాగా పాదయాత్ర చేసి కూర్చోబెట్టి ముద్దులుపెట్టడానికి రాలేదు. నిర్వాసితుల కష్టాలు తెలుసుకుని వారి పక్కన నిలబడడానికి వచ్చాను. నేనూ బస్సులు ఏర్పాటు చేస్తా. పోలవరం నిర్వాసితులను రాజధానికి తీసుకు వెళ్తా. అక్కడ గళమెత్తుదాం' అని ప్రకటించారు.
 
ఇకపోతే, 'నువ్వు పార్టీ నడపలేవు. బీజేపీలోకి వచ్చేసేయ్' అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనను కోరారని చెప్పారు. 'ఒకసారి అమిత్‌షా నన్ను కూర్చోబెట్టుకుని... నువ్వు పార్టీ నడపకు! ప్రాంతీయ పార్టీల హవాలేదు. ఉన్నది జాతీయ పార్టీలే. ఎన్నికలైన 2-3 నెలల తర్వాత పార్టీని నడపలేవు చాలా కష్టమని చెప్పారు. మరేం చేయాలని అడిగాను. బీజేపీలోకి వచ్చేయమన్నారు. 
 
జనసేన పెట్టింది బీజేపీలోకి వచ్చేందుకుకాదని, ఓడిపోయినా, గెలిచినా నిలబడాలని నిర్ణయించుకున్నాను అని తేటతెల్లం చేసినట్టు చెప్పారు. 2016 నుంచి ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నది జనసేన ఒక్కటే అన్నారు. బీజేపీతో తనకు బంధం ఉందనే విమర్శలను తిప్పికొట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా తనకు అన్నా, పెదనాన్న కాదని చెప్పారు. బీజేపీ ద్రోహం చేసిందన్న మాటమీదే తాను ఉన్నానని తేల్చి చెప్పారు.
 
ఇకపోతే, ముఖ్యమంత్రుల సమావేశంలో మోడీకి సీఎం కరచాలనం చేస్తున్నప్పుడు ఆయన కళ్లలో ఎంత ప్రేమ, ఎంత వినయం కనిపించిందో! నన్ను మోడీతో అలా చూశారా అని ప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రినైతే అన్నీ చేస్తా అంటున్న జగన్‌లా, మళ్లీ సీఎంను చేస్తే బాగా చేస్తా అని బాబులా తాను పార్టీని స్థాపించలేదన్నారు. ఎక్కడెక్కడో ఐటీ సోదాలు జరిగితే ముఖ్యమంత్రికి ఎందుకు భయమని నిలదీశారు.