శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (15:57 IST)

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన పవన్ కళ్యాణ్

ప్రముఖ న్యాయవాది కేంద్రమాజీ మంత్రి రాం జెఠ్మలానీ మరణంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జెఠ్మలాని మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఆయన మరణంపై సంతాపం తెలిపిన పవన్.. జెఠ్మలాని మరణం దేశానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.
 
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జెఠ్మలాని తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డారని పవన్ ప్రశంసించారు. న్యాయవాదిగా జెఠ్మలాని పేరు సుపరిచితమనీ, ఆయన కేసును టేకప్ చేశారంటే ఇక గెలిచేసినట్లే అని న్యాయ నిపుణులు చెబుతుంటారని వ్యాఖ్యానించారు. 
 
దేశంలో పేరుమోసిన క్రిమినల్ లాయర్‌గా గుర్తింపు పొందిన రాంజెఠ్మలానీ ఇకలేరు. ఆయన లాయర్‌గా సుదీర్ఘ కెరీర్ ఉంది. 94 ఏళ్ల వయసులోనూ ఆయన హై ప్రొఫైల్ కేసులను డీల్ చేస్తూనే ఉన్నారు. పెద్దపెద్ద నాయకులు లీగల్ ఇష్యూస్ ఎదురైతే.. వారందరికీ కనిపించే ఒకే ఒక్క లాయర్ రాంజెఠ్మలానీ. ఆయన్ని లాయర్‌గా పెట్టుకుంటే… తమను కేసుల నుంచి బయటపడేస్తాడన్న బలమైన నమ్మకం నాయకుల్లో ఉంటుంది. 
 
గుజరాత్ గోద్రా కేసుల్లో నరేంద్ర మోడీని డిఫెండ్ చేసింది రాంజెఠ్మలానీనే. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కేసు, అద్వానీ హవాలా కేసులో, వైఎస్ జగన్ అవినీతి కేసులో డిఫెన్స్ వాదనలు వినిపించింది కూడా ఈయనే కావడం గమనార్హం. ఇందిరా గాంధీ హత్య కేసులోనూ, రాజీవ్ గాంధీ హత్యకేసులోనూ నిందితుల తరపున, పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల తరపున రక్షణాత్మక వాదనలు వినిపించారు. 
 
రాజీవ్ గాంధీ హత్య కేసులో హంతకురాలి తరఫున మద్రాసు హైకోర్టులో డిఫెన్స్ వాదనలు వినిపించారు. దేశంలో ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్లో డిఫెన్స్ లాయర్‌గా రాంజెఠ్మలానీ పేరు తెచ్చుకున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రాంజెఠ్మలానీ పనిచేశారు. 6వ, 7వ లోక్‌సభల్లో.. ముంబై నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 
 
2004 లోక్‌సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయిపై లక్నోలో పోటీ చేశారు. 1959లో మహారాష్ట్రలో కేఎం నానావతీ కేసులో ప్రాసిక్యూటర్‌గా వాదనలు వినిపించి పాపులర్ అయ్యారు రాంజెఠ్మలానీ. స్టాక్ మార్కెట్ స్కామ్స్‌లో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్‌ల తరపున వాదించారు. అఫ్జల్ గురు మరణ శిక్ష, జెస్సికాలాల్ మర్డర్ కేసులో మనుశర్మ తరపున డిఫెన్స్ లాయర్‌గా వ్యవహరించారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.